ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. అందులో భాగంగా కట్టంగూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 పడకల నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.56 కోట్లు మంజూరు చేసింది. దాంతో భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
కట్టంగూర్, జూలై 11 : సమైక్య రాష్ట్రంలో కట్టంగూర్లో 6 పడకల ప్రాథమిక ఆరోగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో వైద్య సిబ్బంది, రోగులకు సరైనా వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. వర్షానికి దవాఖాన భవనం కురవడంతో పాటు శిథిలావస్థకు చేరి స్లాబ్ పై కప్పు ఊడి కింద పడిన ఆ నాటి పాలకులు పట్టించుకోలేదు.
తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే నిధులు వెచ్చించి దవాఖాన భవనానికి మరమ్మతు చేపట్టింది. పాత భవనంలో వసతులు లేకపోవడంతో మండల ప్రజల అవసరాలు, స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జిల్లా మంత్రి సహకారంతో కొత్త భవన నిర్మాణానికి రూ.1.56 కోట్ల నిధులు మంజూరు చేయించారు. దవాఖాన భవన నిర్మాణ పనులు ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ భవన నిర్మాణ పనులు ఇప్పటి వరకు స్లాబ్ వరకు పూర్తయ్యాయి. ఈ భవన నిర్మాణ పనులు పూర్తయితే మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
మండల ప్రజలకు మెరుగైన వైద్యం
కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొత్త భవన నిర్మాణంతో మండల ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో వైద్య సిబ్బంది, దవాఖానకు వచ్చే ప్రజలు నానా అవస్థలు పడేవారు. కొత్త భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిధులు మంజూరు చేసి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సర్కార్ దవాఖానను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది.
-గుండమల్ల పురుషోత్తం, పిట్టంపల్లి