వారంపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, ఉప్పొంగిన వరద ఉధృతితో నీటి వనరులన్నీ కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయానికి ఊతంగా నిలుస్తున్న చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. గతంలో వర్షాలు సమృద్ధిగా పడినా చెరువు నిండుతున్నదంటే ఎక్కడ కట్ట తెగుతుందో తెలియక జనం ఆందోళన చెందేది. పూడికతో నిండిన చెరువులో నిలిచే నీళ్లెన్నో తెలియక గుండె చెరువయ్యేది. ఆరేడేండ్లుగా మాత్రం చెరువు నిండుతున్నదంటే పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతున్నది. తాజా వర్షాలకు జిల్లావ్యాప్తంగా 1,224 చెరువులు నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. వాటిలో 591 చెరువులు మత్తడి దుంకుతున్నా, ఒక్కటంటే ఒక్కచోటా కట్ట తెగడం, గండ్లు పడడం వంటివి లేవు. కారణం..
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో చెరువులు పూర్వవైభవం సంతరించుకుని కండ్లల్లో సంతోషాన్ని నింపుతున్నది.
-సూర్యాపేట, జూలై 31 (నమస్తే తెలంగాణ)
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చిన్న నీటి వనరులు నిండి తొణి కసలాడుతున్నాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 1,224 చెరువులు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు నిండా నిండినా.. చెక్కు చెదరకుండా ఉండడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే చెరువుల ఆధునీకరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఫలితాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. చెరువులు నిండి అలుగులు పోసినా ఆరేండ్లుగా ఒక్కటీ చెక్కు చెదరలేదు. ఎక్కడా గండ్లు పడలేదు. లీకేజీలు సైతం లేకపోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– సూర్యాపేట, జూలై 31 (నమస్తే తెలంగాణ)
మిషన్ కాకతీయతో చెరువులకు కొత్త శోభ నాటి పాలకుల దాష్టీకానికి గంగాళాలుగా ఉన్న చెరువులు తాంబాలాలుగా మారాయి. గతంలో చెరువులను చూస్తే.. చిన్నపాటి వరదకే గండ్లు పడి వచ్చిన నీరంతా కిందికి పోయేది. అది చూసిన రైతులు కంటనీరు పెట్టేది. శిథిలావస్థకు చేరిన తూములు, కూలిపోయిన అలుగులు, ఆనవాళ్లు కనిపించని కట్టలు, నీళ్లు లేక కనిపించే నెర్రెలు.. ఎప్పుడైనా కురిసిన వర్షాలకు వరదలు పారితే మొత్తానికి మొత్తం జారిపోయే పరిస్థితి ఉండేది. అక్కడక్కడ గుంతల్లో ఎండమావుల్లా మచ్చుకు కనిపించే కొద్దిపాటి నీరు.. వాటితో సాగుమాట దేవుడెరుగు కనీసం పశువుల దాహం కూడా తీరేది కాదు. అలాంటి దయనీయ స్థితి నుంచి నేడు చెరువులు కొత్త శోభ సంతరించుకొని జలకళతో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించాల్సిన ప్రాజెక్టులను విస్మరించగా కాకతీయుల కాలంలో తవ్విన చెరువులు ధ్వంసమవుతున్నా కళ్లప్పగించి చూశారే తప్ప.. కాపాడాలనే ఆలోచన చేయలేదు. దీంతో పలు చెరువులు పూడిపోయి కనీస ఆనవాళ్లు కనిపించకుండా మైదానాలుగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ ముందుగా విధ్వంసానికి గురైన చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ ప్రవేశపెట్టింది. నాలుగు విడుతలుగా చేపట్టిన ఈ కార్యక్రమంతో చెరువులన్నీ బాగుపడ్డాయి. దీని ఫలాలు నేడు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. చెరువులను ఆధునీకరించి పూర్వ వైభవం తీసుకొస్తానని, రైతుల కళ్లల్లో ఆనందం నింపుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యం అయ్యాయి.
అర్వపల్లి, జూలై 30 : మండలంలోని పెద్ద చెరువుల్లో ఒకటైన అర్వపల్లి తీగల చెరువు గత పాలకుల నిర్లక్ష్యంతో పూడికతో నిండిపోయింది. దాంతో ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోయి నెర్రెలు బారేది. ఈ చెరువు నిండినా ఒక సీజన్లో కనీసం 20ఎకరాలకు కూడా నీళ్లు సరిపోయేవి కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా రూ.45లక్షలతో పూడికతీత పనులు చేపట్టారు. అప్పటి నుంచి రెండు పంటలకు సరిపడా నీళ్లు అందుతున్నాయి. దీనికితోడు కాళేశ్వరం జలాలతో చెరువు ఎప్పుడూ నీటితో కళకళలాడుతున్నది. భూగర్భజలాలు పెరిగి చుట్టుపక్కల బోరుబావులు పుష్కలంగా పోస్తున్నాయి. ఇప్పుడు ఈ చెరువు కింద 150 ఎకరాలు సాగవుతున్నది.
సూర్యాపేట జిల్లాలో 1,224 చెరువులు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా నాలుగు విడుతల్లో సుమారు రూ.410 కోట్లతో వెయ్యికి పైగా చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. పూడిక తీయడం, చెరువు కట్టల పటిష్టం, తూముల మరమ్మతులు చేపట్టి ఆధునీకరించింది. దీంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండినా ఒక్కటంటే ఒక్క చెరువుకు కూడా నష్టం జరుగకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నల కోసం అన్నీ చేస్తుండగా.. సాగునీటి కోసం నిర్మిచిన భారీ ప్రాజెక్టు కాళేశ్వరం పూర్తి కావడంతో సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేటతోపాటు కోదాడ పరిధిలోని పలు మండలాలు సస్యశ్యామలం అయ్యాయి. ఏడాదిలో రెండు పంటలకు పుష్కలంగా గోదావరి జలాలు వస్తుండగా పాతాళానికి చేరిన భూగర్భజలాలు పైకి వచ్చాయి. వర్షాకాలంలో చెరువులు అలుగు పోస్తుండగా.. ఏడాదిలో దాదాపు 8 నెలల పాటు నిండా నీళ్లు ఉంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 25 శాతం నిండిన చెరువులు 56 ఉండగా 25 నుంచి 50 శాతం నిండినవి 109 ఉన్నాయి. 50 నుంచి 75 శాతం నిండిన చెరువులు 187, వంద శాతం నిండినవి 259 ఉండగా.. 639 చెరువులు అలుగులు పోస్తున్నాయి. అయినా ఒక్క చెరువుకు కూడా గండి పడకపోవడానికి మిషన్ కాకతీయ ఫలమే కారణం. ఎంత వరద వచ్చినా గండ్లు పడకుండా పటిష్టంగా ఉండడంతో అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. గతంలో బోరు నీటితో ఒక ఎకరం సాగు చేసేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మిషన్ కాకతీయ ద్వారా మా ఊరులోని చెరువులో పూడిక తీశారు. ఇప్పుడు మా చెరువుతోపాటు చుట్టుపక్కల అన్ని చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కాళేశ్వరం జలాలు రావడంతో చెరువులు ఎప్పుడూ ఎండిపోవట్లేవు. భూగర్భ జలాలు కూడా పెరిగి బోర్లు, బావులు పుష్కలంగా పోస్తున్నాయి. దీంతో నాకున్న నాలుగు ఎకరాల్లోనూ వరి సాగు చేస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే కిశోర్కుమార్ కృషితో మా ప్రాంతం పచ్చని పొలాలతో కళకళలాడుతున్నది.
– తొట్టె లింగయ్య, రైతు, పర్సాయపల్లి, అర్వపల్లి మండలం