పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా తొలి విడుతలో 8,400 యూనిట్లు మంజూరు కాగా ఇప్పటివరకు 34,750 దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఒక్కొక్కరికి రూ.3 లక్షల సాయం అందించనున్నారు. దరఖాస్తుల ఆధారంగా ప్రత్యేక బృందాలు ఇప్పటికే సర్వే చేసి జాబితాను రూపొందించాయి. త్వరలో అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. పారదర్శకంగా పథకం అమలయ్యేలా సర్కారు చర్యలు చేపట్టింది. ఇక సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారి ఆశలు తీరబోతున్నాయి.
– భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 10
భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 10 : సొంత జాగా కలిగిన ప్రతి ఒక్క అర్హుడికి సొంతింటి కలను సాకారం చేయాలనే తలంపుతో ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 8,400 యూనిట్లు మంజూరు చేయగా 34,750 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను తాసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి సమగ్ర జాబితాను రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గత నెల 10వ తేదీ వరకు గృహలక్ష్మి దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించగా 17 మండలాలు, 6 మున్సిపాలిటీలకు చెందిన లబ్ధిదారులు ఆయా తాసీల్దార్ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించారు. అర్హుల ఎంపిక పక్రియలో భాగంగా ఆగస్టు 12వ తేదీన ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు వివరాలు సేకరించారు. ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం మూడు విడుతల్లో రూ.3 లక్షలను ఖాతాల్లో జమ చేయనున్నది.
జిల్లాలోని 17 మండలాలు, 6 మున్సిపాలిటీలకు చెందిన అర్హులైన 8,400 మందికి గృహలక్ష్మి పథకంలో భాగంగా లబ్ధి చేకూరనున్నది. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో భువనగిరి నియోజకవర్గంలో 3 వేలు, ఆలేరు నియోజకవర్గంలో 3 వేలు, సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్ మండలాలను కలుపుకుని 1,250, మోత్కూరు, అడ్డగూడూరు మండలాలను కలుపుకుని 750, రామన్నపేట మండలంలో 400 మందికి మొత్తం 8,400 మందికి పథకంలో భాగంగా విడుతల వారీగా నిధులు మంజూరు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 34,750 దరఖాస్తులు వచ్చాయి.
అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా పథకాన్ని అందించేందుకు అధికారులు సమగ్ర చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో నిర్దేశించిన 8,400 మంది లబ్ధిదారులకు మొదటి విడుతలో పథకం ప్రయోజనం చేకూర్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సొంతింటి స్థలం కలిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే రూ.3 లక్షలను లబ్ధిదారు ఖాతాలో విడుతల వారీగా జమ చేసేందుకు చర్యలను వేగవంతంగా చేస్తున్నారు.