75 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. వజ్రోత్సవాల్లో మూడో రోజు గురువారం జిల్లా వ్యాప్తంగా ఫ్రీడం రన్ ఉత్సాహంగా సాగింది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరుగులో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలను ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. దీంతో ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. యువత దేశభక్తి నినాదాలతో రోడ్లన్నీ దద్దరిల్లాయి. ప్రతి ఇంటికీ జాతీయ జెండాను అందించే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది. వన మహోత్సవంలో భాగంగా అనేక చోట్ల మొక్కలు నాటారు. నేడు రాఖీ పండుగను కూడా వజ్రోత్సవాన్ని జోడిస్తూ జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : వజ్రోత్సవ వేడుకలు ఉమ్మడి జిల్లా అంతటా అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో రెట్టించిన ఉత్సాహంతో కొనసాగుతున్నాయి. గురువారం జిల్లా కేంద్రాలతోపాటు పట్టణ, మండల కేంద్రాల్లో ఫ్రీడం రన్ విజయవంతంగా సాగింది. నల్లగొండలో జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరితో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఫ్రీడం రన్ ప్రారంభించారు. వందలాది మంది త్రివర్ణ పతాకాలు చేతబూని ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు కదం తొక్కారు. దేశభక్తి, జాతీయ సమైఖ్యతను పెంపొందించేలా సాగిన రన్ పట్టణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నది. హాలియాతోపాటు నందికొండ, నిడమనూరులో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ ఫ్రీడం రన్ను ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని పట్టుకుని ఎమ్మెల్యే రన్లో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్రావు ఫ్రీడం రన్ను ప్రారంభించారు. వన్టౌన్, టూటౌన్ పోలీసులు వేర్వేరుగా రెండు ప్రాంతాల్లో నిర్వహించిన రన్లో ప్రజలు భాగస్వాములయ్యారు. నార్కట్పల్లిలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఫ్రీడం రన్ను ప్రారంభించారు. జాతీయ పతాకంతో రన్లో ఎమ్మెల్యే ముందు నడవగా పెద్ద సంఖ్యలో ప్రజలు భాగస్వాములయ్యారు. కోదాడలో ఫ్రీడం రన్ను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రారంభించారు.
కేఎల్ఆర్ కాలేజీ నుంచి వై జంక్షన్ వరకు సాగిన రన్లో ఎమ్మెల్యే పాల్గొని యువకులను ఉత్సాహపరిచారు. త్రివర్ణ పతాకాలతో పట్టణంలో ప్రత్యేక శోభ సంతరించుకున్నది. చిలుకూరులోనూ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఫ్రీడం రన్లో పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఫ్రీడం రన్ను ప్రారంభించారు. యువకులు, స్థానికులతో కలిసి ఎమ్మెల్యే సునీత రన్లో పాల్గొన్నారు. దేశభక్తిని చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. భువనగిరిలో ఫ్రీడం రన్ను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు వచ్చి తిరిగి హైదరాబాద్ చౌరస్తా వరకు సాగిన రన్లో యువత, పోలీసులు, ప్రజలు భాగస్వాములయ్యారు. వరుసగా మూడో రోజూ ఉమ్మడి జిల్లా అంతటా ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కొనసాగింది. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జెండాలను ఉచితంగా అందిస్తున్నది.
ఘనంగా రక్షాబంధన్కు మంత్రి కేటీఆర్ పిలుపు
రక్షాబంధన్ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలంతా స్థానికంగా గురుకుల కళాశాలలు, పాఠశాలలు, కస్తూర్బా స్కూళ్లను సందర్శించి విద్యార్థినులతో రాఖీ పండగను జరుపుకోవాలని సూచించారు. పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, ప్రతి బస్తీలో నిర్వహించే కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగంతోపాటు ఇతర విభాగాల నేతలు కూడా భాగస్వాములవ్వాలని సూచించారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం జరుగాలన్నారు. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ నిర్వహణకు పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధమయ్యారు.