నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష
న్నికల హామీల అమలు ప్రణాళిక
కోసమే రాక : మంత్రి జగదీశ్రెడ్డి
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నోముల భగత్
హాలియా, జూలై 28 : వచ్చే నెల 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి రానున్నారు. హాలియాలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రముఖులతో ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల సమయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మిగిలి ఉన్న అభివృద్ధి అంశాలను నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు సమస్యలపై చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుని, అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నట్లు జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హాలియా పట్టణంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే నోముల భగత్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్తో కలిసి పరిశీలించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 2న హాలియాకు రానున్నట్లు అధికారికంగా సమాచారం అందగా.. బుధవారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ ఏవీ రంగనాథ్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించారు. హాలియా ప్రభుత్వ ఐటీఐలో అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు వీలుగా చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. హెలీపాడ్ ఏర్పాట్లపై కూడా చర్చించారు. అనంతరం కలెక్టర్ హాలియా పట్టణంలో పర్యటించి మున్సిపల్ కమిషనర్కు పలు సూచనలు చేశారు. పారిశుధ్యాన్ని మెరు గుపర్చాలని, ఎన్నెస్పీ కెనాల్ వెంట మొక్కలు నాటాలని ఆదేశించారు. ఆయన వెంట అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, ఆర్డీఓ రోహిత్ సింగ్, మున్సిపల్ కమిషనర్ వేమనరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ నరేందర్ పాల్గొన్నారు.
అభివృద్ధి పరుగులు :ఎమ్మెల్యే భగత్
ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాకు రావడం వల్ల నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి కొత్త మలుపు తిరుగనున్నదని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 14న హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 2న వస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే హాలియాకు డిగ్రీ కళాశాల, నెల్లికల్లు లిఫ్ట్ మంజూరు చేయడంతో పాటు ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షలు, మున్సిపాలిటీకి రూ.30 లక్షలు, మున్సిపాలిటీకి రూ. కోటి చొప్పున విడుదల చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి సమీక్ష చేయడం వల్ల నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కారం కానున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, వెంపటి శంకరయ్య, కౌన్సిలర్లు వర్రా వెంకట్రెడ్డి, ప్రసాద్నాయక్, అన్నెపాక శ్రీను ఉన్నారు.