యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమ సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మొదటి విడుతలో జిల్లాలో 251 స్కూళ్లను బాగు చేయాలని ఎంపిక చేశారు. ఇందులో 83 హైస్కూళ్లు, 148 ప్రాథమిక, 20 మాధ్యమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో రూ.30లక్షల్లోపు నిధులు అవసరం ఉన్నవి 225 బడులు ఉండగా.. ఇప్పటికే అన్నింటిలో పనులు ప్రారంభమయ్యాయి. రూ.30లక్షల కంటే ఎక్కువ నిధులు కావల్సినవి 26 స్కూళ్లు ఉన్నాయి. ఇందులో నాలుగు స్కూళ్లలో పనులు మొదలు కాగా.. మిగతావి ప్రాసెస్లో ఉన్నాయి. మొత్తంగా రూ.48.3కోట్లు మంజూరయ్యాయి.
మన ఊరు- మన బడి కార్యక్రమంతో కొత్తరూపు సంతరించుకున్న అనాజీపురం పాఠశాల
50 బడుల్లో పనులు పూర్తి
మన ఊరు-మన బడి కార్యక్రమం పనులు జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 251 స్కూళ్లలో కార్యక్రమం ప్రారంభించిన మొదట్లోనే ఒక్కో మండలానికి రెండు మోడల్ స్కూళ్లను ఎంపిక చేశారు. మొత్తం 34 స్కూళ్లలో ఇప్పటికే బిల్డింగ్, పెయింటింగ్, మేజర్, మైనర్ రిపేర్లు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తయ్యాయి. ఇవే కాకుండా మరో 16బడుల్లో కూడా పనులు అయిపోయాయి. నాలుగైదు రోజుల్లో ఇతర చిన్న చిన్న పనులు పూర్తికానున్నాయి. ఆలేరు మండలంలోని కొలనుపాక, శారాజీపేట, వలిగొండ మండలంలోని సంగెం, పోచంపల్లి మండలంలోని భీమనపల్లి, దంతూరు, బీబీనగర్ మండలంలోని బట్టుగూడ, భువనగిరి మండలంలోని గాంధీనగర్, అనాజీపూర్, చౌటుప్పల్ మండలంలోని పీపల్పహాడ్, యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట, సైదాపూర్, మోత్కూర్ స్కూళ్లతోపాటు మరికొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతా బడుల్లో వర్క్స్ చివరి దశలో ఉన్నాయి. ఈ నెల 10వరకు అన్ని చోట్లా పనులు పూర్తయ్యేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆకర్షణీయంగా సైదాపురం పాఠశాల
యాదగిరిగుట్ట రూరల్ : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. అంతకుముందు శిథిలావస్థలో ఉన్న ఈ పాఠశాల మరమ్మతులు చేపట్టారు. భవనానికి పూర్తిగా రంగులు వేసి, అందులో కరెంట్ పనులు చేయించారు. దాంతో పాఠశాల ఆకర్షణీయంగా మారడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మోత్కూరు ప్రాథమిక పాఠశాలకు కొత్త శోభ
మోత్కూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం రూ.16.36 లక్షలు మంజూరు చేసింది. ఆ డబ్బుతో ఇప్పటికే పాఠశాల తరగతి గదులకు పెయింటింగ్ పనులు పూర్తి చేశారు. ఎలక్ట్రికల్, తాగునీరు, మరుగుదొడ్ల పనులు జరుగుతున్నాయి. పెయింటింగ్ పనులు పూర్తి కావడంతో పాఠశాల కొత్త శోభ సంతరించుకున్నది.
భువనగిరి కలెక్టరేట్ : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భువనగిరి మండలంలోని అనాజీపురం ప్రభుత్వ పాఠశాల మొదటి విడుతలో ఎంపికైంది. దాంతో ప్రభుత్వం నుంచి పాఠశాల అభివృద్ధికి రూ.29లక్షలు మంజూరయ్యాయి. ఆ నిధులతో స్కూల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. విద్యుత్ సౌకర్యం, తాగునీరు, ఇతర వసతులు, మేజర్, మైనర్ మరమ్మతులు, డైనింగ్ హాల్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిసిటీ పనులు పూర్తయ్యాయి. పాఠశాల భవనాలతోపాటు ప్రహరీ గోడలపై విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించేలా పాఠ్యాంశాల్లోని ప్రధానాంశాలు, విద్యతో కలిగే ప్రయోజనాలు తదితర అంశాలకు సంబంధించిన చిత్రాలు ఏర్పాటు చేయనున్నారు.