ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటికి, కరెంట్కు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల మొదలైతేనే రైతులు పంటలు సాగు చేసేవారు. లేకుంటే పడావు పెట్టేవారు. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం చెరువులను బలోపేతం చేయడం, చెక్డ్యామ్లు నిర్మించడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీనికితోడు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎగువన వర్షాల్లేని కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఆశాజనకంగా నీరు లేక కాల్వలకు సాగునీరు విడుదల చేయని పరిస్థితి. అయినా రైతులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏటా వానకాలం సీజన్లో వేసే మాదిరిగానే సుమారు లక్ష ఎకరాల్లో వరి సాగు చేశారు. మరో 10 వేల ఎకరాల్లో పత్తి, మిర్చి, మినుము, కంది తదితర పంటలు వేశారు. వీటిన్నంటికీ ఆధారం ఉచిత కరెంటే. బోర్లు, బావులు, చెరువులు, లిఫ్ట్ల ద్వారా నీటిని సమకూర్చుకుంటున్నారు. 7,032 ట్రాన్స్ఫార్మర్ల ద్వారా 29,792 వ్యవసాయ మోటర్లు నిత్యం పని చేస్తున్నాయి. సమైక్య పాలనలో అరకొర విద్యుత్, బోర్లు, బావులు ఎండిపోవడంతో సాగు చేయలేకపోయామని, ఇప్పుడు నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉండడంతో తమ భూమితోపాటు కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు.
మిర్యాలగూడ రూరల్, సెప్టెంబర్13 : నాగార్జునసాగర్ ఆయకట్టు కింద కాల్వ నీరు రాకున్నా ఉచిత కరెంటు వరి సాగుకు ఊపిరి పోస్తున్నది. గతంలో సాగర్ కాల్వ వస్తేనే పొలం దున్నే, నాట్లు వేసే పరిస్థితి. ప్రాజెక్ట్లో నీరు లేకపోతే ఆయకట్టంతా కరువు తాండవించేది. కానీ, స్వరాష్ట్రంలో రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు సరఫరా చేసేందుకు జీఓ జారీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా ఉచిత కరెంటు పంటల సాగుకు ఊతమిచ్చింది. ముఖ్యంగా నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ప్రాజెక్టులో నీరు లేని, సాగు నీరు రాని సీజన్లో 24 గంటల ఉచిత కరెంటు వరి సాగుకు ఊపిరిలూదింది. ఈ సంవత్సరం సాగర్ డ్యామ్లో నీటి మట్టం ఆశాజనకంగా లేకపోవడంతో కాల్వలకు సాగు నీరు వదిలే పరిస్థితి లేకుండాపోయింది. అయినా రైతులు నిరాశ చెందలేదు. 24 గంటల ఉచిత కరెంటుతో బావులు, బోర్లపై ఆధారపడి వరి సాగును కొనసాగిస్తున్నారు. కాల్వ నీరు రాకున్నా సాగులో తగ్గేదేలే అన్నట్లు ఆయట్టులో వరి సాగు చేశారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ, దామరచర్ల, అడవిదేవులపల్లి, వేములపల్లి, మాడ్గులపల్లి మండలాల్లో 7,032 ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో 29,782 పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సప్లయ్ చేస్తున్నట్లు ట్రాన్స్కో అధికారులు వెల్లడించారు. బోరుబావుల కింద సుమారు లక్ష ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ సంవత్సరం బోరుబావులకు ఉచిత కరెంటు కోసం 597 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 364 మందికి ఉచిత కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిసింది.
పాడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది. పాల ఉత్పత్తి పెంపుపై పాడి రైతులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే అవగాహన కల్పించడం అభినందనీయం. డెయిరీల్లో పాలు పోసిన రైతులకు 15 రోజులకోసారి డబ్బులు అందజేస్తున్నారు. అలాగే డెయిరీ సంస్థల నుంచి బర్రెలు, ఆవులను అందజేయటంతోపాటు లీటరుకు రూ.4 ప్రోత్సాహం అందిస్తున్నారు. అలాగే సబ్సిడీపై గడ్డి విత్తనాలు, దాణా, మినరల్ మిక్షర్, కాల్షియం అందించడం హర్షణీయం. పశు వైద్యాధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పాడి పశువులకు మొబైల్ వైద్య సేవలు అందిస్తున్నారు. పాడి రైతుల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వానికి పాడి రైతులంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు.
-చింతలపూరి వెంకట్రాంరెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్, రేణికుంట, రాజాపేట
వ్యవసాయ రంగంలో భాగమైన పాడి పరిశ్రమ అభివృద్ధిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశుపోషణ, పశువులకు సోకే వ్యాధుల పట్ల వైద్యులు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. పాల ధరలు సైతం సంతృప్తికరంగా ఉండడంతోపాటు లీటరుకు రూ.4 ప్రోత్సాహం అందిస్తూ రైతాంగానికి అండగా నిలుస్తుంది.
-కొడారి రామస్వామి, పాడి రైతు, దత్తాయపల్లి, తుర్కపల్లి
ప్రభుత్వం నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తుండడంతో బోర్లు వేసుకొని వరి సాగు చేస్తున్నా. నాకు 3 బోర్లు ఉన్నాయి. కాల్వ వచ్చినప్పుడు ఎంత నాటేశామో ఇప్పుడు కూడా అంతే వేశాను. నాకున్న 12 ఎకరాలతోపాటు 3 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. ఇదంతా సాగర్ ఆయకట్టు పరిధిలోనే ఉంది. కాల్వ నీళ్లు రాకున్నా బోర్ల ద్వారా సాగు చేశాను. ఇది ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంటుతోనే సాధ్యమైంది.
-కందుల నాగిరెడ్డి, రైతు, దామరచర్ల
ఐదు మండలాల్లో బోరుబావుల కింద సుమారు 10 వేల ఎకరాల్లో పత్తి, మిర్చి, మినుము, కంది వంటి వాణిజ్య, పప్పు ధాన్యాలు సాగు చేశారు. ముఖ్యంగా అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి, వేములపల్లి, దామరచర్ల మండలాల్లో బోరుబావుల కింద ఆరుతడి పంటలు సాగు చేశారు.
ఎడమ కాల్వకు సాగు నీరు రానప్పటికీ ప్రత్యామ్నయంగా రైతులు బోర్లు, బావులు, చెరువులు, వాగులు, లిప్టుల ద్వారా భారీగా వరి సాగు చేశారు. ముఖ్యంగా మిర్యాలగూడ మండలంలో ఎటుచూసినా వరి పైరు పచ్చదనంతో కనివిందు చేస్తున్నది. ఇక్కడ సాగైన వరి పైరును చూస్తే కాల్వ నీరు రాలేదన్న దిగులు ఎక్కడా కనిపించదు.