సమైక్య పాలనలో కరెంట్ లేక జనం ఎన్నో అవస్థలు పడ్డారు. రోజు మొత్తంలో వచ్చే ఆరు నుంచి ఎనిమిది గంటల కరెంట్తో ఏ పనులూ కాకపోయేవి. పరిశ్రమలు నడువకపోయేవి. వ్యాపార సంస్థలు, దవాఖానలు జనరేటర్లపై ఆధారపడేవి. వచ్చిపోయే కరెంట్తో పూర్తి స్థాయిలో నీరందక పంట పొలాలు ఎండిపోయేవి. లోఓల్టేజీతో వచ్చే కరెంట్తో తరుచూ మోటర్లు, ఫ్యాన్లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు. ఆ శాఖ మంత్రిగా జగదీశ్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పనిచేశారు.
కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. నాటి ఇబ్బందులన్నీ అధిగమించి అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నారు. 2017 సంవత్సరం నుంచి 24 గంటల కరెంట్ను సరఫరా చేస్తున్నారు. నాడు అంధకారంలో మగ్గిన తండాలు, మారుమూల గ్రామాల్లోనూ నేడు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నది. పరిశ్రమలు విరామం లేకుండా నడుస్తున్నాయి. స్వయం ఉపాధిని నమ్ముకొని పని చేసుకునే వారికి నిరంతర కరెంట్ ఎంతో దోహదపడుతున్నది. బోర్లు, బావుల ద్వారా రైతులు పంటలు పుష్కలంగా పండిస్తున్నారు. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినా సర్కారు ఏ సమస్యా లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే మెరుగైన విద్యుత్ కోసం రూ.1,342 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు సరిగ్గా ఉండకపోవడంతో ఫర్నిచర్, ఉడ్ వర్క్ పనులు అసలు జరిగేవి కావు. సీఎం కేసీఆర్ పెద్ద పరిశ్రమల నుంచి చిన్న పరిశ్రమల వరకు 24గంటల కరెంటు ఇవ్వడంతో నేడు రోజంతా మిషన్లు నడుస్తున్నాయి. ఫర్నిచర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులు ఎక్కువ జరుగుతుండడంతో నెలకు 40 నుంచి 50 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నాం. మరో నలుగురికి ఉపాధి దొరుకుతున్నది. పరిశ్రమలకు 24గంటల విద్యుత్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– పగిడోజు యశోద, జనగాం క్రాస్ రోడ్డు (సూర్యాపేట రూరల్)
గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ కోతలలో సతమతమైనం. కరెంట్ కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత నిరంతరం విద్యుత్ వస్తున్నది. కరెంట్ పోయే సమస్యలు లేవు. పరిశ్రమలు, గృహ వినియోగదారులకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు. 24గంటలు ఉండడం వల్ల పనులు మంచిగా జరిగి లాభాలు వస్తున్నాయి. మళ్లీ పాత రోజులు చూడాలనుకోవట్లేదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వెన్నంటే ఉంటాం.
– కర్నె వెంకన్న, మఠంపల్లి
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 24గంటల కరెంట్ ద్వారా మాకు ఎంతో మేలు జరుగుతున్నది. మా లాంటి పేదవాళ్లకు ఇది ఒక వరం. గత ప్రభుత్వాల హయాంలో వచ్చిరాని కరెంట్తో ఒక మోటరు కాలిపోతే బాగు చేయడానికి రెండు, మూడు రోజులు పట్టేది. నిత్యం కరెంట్ కోసం ఎదురుచూసేది. కరెంట్ కోతల కారణంగా పనులు జరుగక మా లాంటి పేదల జీవనం గడవడం కష్టంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 24గంటల కరెంట్ ఇవ్వడంతో రోజుకు 3నుంచి 4మోటర్లు బాగు చేస్తున్నాం. జీవనాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నాం. 24గంటల కరెంట్ అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి జగదీశ్రెడ్డికి రుణపడి ఉంటాం.
– కట్ట అజయ్, పాతర్లపహాడ్, ఆత్మకూర్.ఎస్ మండలం
సమైక్య రాష్ట్రంలో రోజుకు ఆరు గంటల విద్యుత్ సరఫరా చేస్తే.. నిరంతరాయంగా అరగంట పాటు కూడా రాకపోయేది. కరెంటు లేకుంటే ఆసుపత్రుల్లో చికిత్సలు ఆగిపోయిన పరిస్థితి. దుకాణాల్లో లైట్లు వెలగక, ఫ్యాన్లు తిరగక నరకయాతన పడ్డారు. ఈ క్రమంలో 2014కు ముందు సబ్స్టేషన్ల ముట్టడిలు, ఫర్నిచర్ విధ్వంసాలు, విద్యుత్ అధికారుల నిర్బంధాలు, రోడ్లపై ధర్నాలు, నిరసనలు నిత్యకృత్యంగా కనిపించేవి. నేడు మచ్చుకు కూడా అలాంటి ఘటనలు కనిపించడంలేదు. 2001లో నాటి ఉద్యమ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పటైతే నీళ్లు, నిధులు, ఉద్యోగాలతోపాటు ప్రతి రంగంలో కచ్చితమైన ఫలితాలు కనిపిస్తాయని వివరించి చెప్పారు. 14 ఏండ్ల పోరాటంతో రాష్ట్రం ఏర్పాటు కావడం, ఉద్యమ నేత కేసీఆరే ముఖ్యమంత్రి కావడంతో ప్రజలుగన్న కలలన్నీ నేడు సాక్షాత్కరిస్తున్నాయి. అన్నింటికన్నా ప్రధానమైనది విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 2014కు ముందు రోజుకు 6 నుంచి 8 గంటల కరెంట్ ఇస్తే.. అరగంటకు మించి నిరంతరాయంగా వచ్చేది కాదు. దీంతో సాధారణ ప్రజల నుంచి వాణిజ్య, వ్యాపార వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు 24 గంటలు సరఫరా చేస్తుండడంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.
సమైక్య పాలనలో విద్యుత్ కోతలతో జనం అరిగోస పడ్డారు. కనీసం ఆరు గంటలు కూడా సరఫరా కాకపోవడంతో చిన్న, పెద్ద పరిశ్రమలు మూతపడిన పరిస్థితి. షాపులు, చిన్న చిన్న వ్యాపారాలు జనరేటర్లు, ఆయిల్ ఇంజిన్ల సాయంతో నడిపిన దుస్థితి. ఇండ్లల్లో ఇన్వర్టర్లు పెట్టుకున్నారు. నేడు ఆ పరిస్థితి మారింది. స్వరాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండడంతో అన్ని వర్గాల ప్రజల బాధలు తప్పినయి. ఆయిల్ ఇంజిన్ల మోతలు ఆగినయి. జనరేటర్లు కనపడకుండా పోయాయి. నాటి పరిస్థితులను తలుచుకుంటే వామ్మో.. అదో పీడకల అంటున్నారు జనం.
సూర్యాపేట జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలతోపాటు వాణిజ్య, వ్యాపార సంస్థలు, సాధారణ ప్రజలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,342 కోట్లు ఖర్చు చేసింది. 2014కు ముందు జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 56 ఉండగా.. నేడు 106కు పెరిగాయి. 624 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు ఉంటే.. నేడు 1,194 కిలోమీటర్లు, 11 కేవీ లైన్లు గతంలో 4,434 కిలోమీటర్లు ఉండగా.. ఇప్పుడు 10,014 కిలోమీటర్లు, నాడు ఎల్టీ లైన్లు 14,171 కిలోమీటర్లు ఉంటే.. ప్రస్తుతం 21,231 కిలోమీటర్లు ఉన్నాయి. నాడు 128 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటే.. నేడు 215, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 20,544 ఉంటే.. ఇప్పుడు 45,746కు చేరాయి.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్య తీరిపోగా.. ఏడాదిలోనే అన్ని వర్గాలకు 24గంటల కరెంట్ అందించారు. దీంతో వ్యాపారాలు, పరిశ్రమలు నిర్విరామంగా నడుస్తున్నాయి. గతంలో విద్యుత్ కోతల కారణంగా ఆసుపత్రుల్లో జనరేటర్ల సాయంతో, ఒక్కోసారి కిరోసిన్ దీపాల వెలుగులో చికిత్సలు అందించిన ఉదంతాలు కోకొల్లలు. నేడు జిగేల్మనిపించే వెలుతురు, ఏసీలు, ఫ్యాన్ల నడుమ చికిత్సలు అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో విద్యుత్ సక్రమంగా సరఫరా చేసే పరిస్థితి లేకపోగా.. మనకు మాత్రం 24గంటలు కోతలు లేకుండా సరఫరా చేయడం పట్ల ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నాటి పరిస్థితి ఓ పీడ కల అని, నేటి సంతోషం చెప్పనలవి కానిదని జనం పేర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనిరంతర విద్యుత్ సరఫరాతో వ్యాపారంలో వృద్ధి పెరిగింది. మా షాపులో ఫ్రిజ్, కూలర్లు నిరంతరం పనిచేస్తుండడంతో వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందించగలుగుతున్నాం. గత ప్రభుత్వాల పాలనలో వేళాపాలా లేకుండా కరెంట్ పోయేది. వేసవి కాలంలో అయితే దారుణం. పట్టుమని నాలుగు గంటలు కూడా ఉండేది కాదు. అది కూడా నిరంతరంగా రాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కరెంటు కష్టాలు పోయినయ్. నాణ్యమైన విద్యుత్తో ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఎక్కువ కాలం మన్నుతున్నాయి. పవర్ ఫుల్ ప్రభుత్వానికే మా మద్దతు ప్రకటిస్తాం.
– మట్టపల్లి పుల్లయ్య గౌడ్, కిరాణా షాపు నిర్వాహకుడు, పాలవరం, అనంతగిరి మండలం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తీవ్ర కరెంట్ కష్టాలు చూశాం. రోజు మొత్తంలో 5 నుంచి 6 గంటలు మాత్రమే కరెంట్ వచ్చేది. వేల రూపాయలు ఖర్చు చేసి పవర్ బ్యాకప్ కోసం ఇన్వర్టర్లు కొనుక్కోవాల్సి వచ్చేది. వచ్చిన పైసల్లో చాలా వరకు దుకాణం కిరాయి, కరెంట్ బిల్లులకే సరిపోయేది. కరెంట్ హెచ్చుతగ్గుల వల్ల కంప్యూటర్లు కాలిపోతూ ఉండేవి. నష్టాలు భరించలేక షాపును తీసేసి కూలి పనులకు పోదామనుకున్నా. అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. 24గంటలు నాణ్యమైన విద్యుత్ అందించడంతో మాకు కరెంట్ కష్టాలు పోయాయి. ఎనిమిదేండ్లుగా ఇన్వర్టర్తో పనిలేకుండా కంప్యూటర్ రిపేర్ హార్డ్వేర్ దుకాణం నడుపుతున్నా. కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువగా వస్తున్నది. నిత్యం కరెంట్ ఉండడం వల్ల ఇబ్బందులు లేకుండా రిపేరింగ్ చేసుకుంటున్నా. లాభాలు మంచిగా వస్తుండడంతో ఏ చింతా లేకుండా జీవనం సాగిస్తున్నాం. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– నాగరాజు, కంప్యూటర్ హార్డ్వేర్ షాపు, హుజూర్నగర్
నేను సూర్యాపేట పట్టణంలోని ఏపూర్ బస్టాండ్ వద్ద 35సంవత్సరాలుగా మోటర్ వైండింగ్ వర్క్స్ చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలను చాలా చూశాను. రోజుకు కనీసం మూడు గంటలు కూడా ఉండేది కాదు. లోఓల్టేజీ సమస్యతో రైతుల మోటర్లు తరచూ కాలిపోయేవి. దీంతో వాళ్లు మోటర్లు తీసుకొచ్చి తొందరగా చేయమని వేడుకునేది. కరెంట్ కోతల కారణంగా త్వరగా పని అయ్యేదికాదు. రైతుల ఇబ్బందులు చూస్తే మాకు బాధనిపించేది. కానీ.. ఏం చేయలేని పరిస్థితి.
జనరేటర్లను తీసుకొచ్చి పెట్టి నడిపేవాళ్లం. రైతులు ఇచ్చే డబ్బులు జనరేటర్ ఖర్చులకు సరిపోకపోవడంతో చేసేదేమీ లేక ఖాళీగానే ఉండేది. వామ్మో.. ఆ రోజులను తలుచుకుంటేనే భయమేస్తుంది. దేవుడా మళ్లా అలాంటి రోజులు రావద్దనే కోరుకుంటాను. స్వరాష్ట్రంలో 24గంటల కరెంట్ ఇవ్వడంతో అందరి కళ్లల్లో ఆనందం నిండుకుంది. మాతో పాటు కరెంట్పై ఆధారపడిన అనేక వ్యాపారాలు పుంజుకున్నాయి. పదేండ్ల కాలంలో మండు వేసవిలో సైతం ఒక్కనాడంటే ఒక్క నాడు కూడా కరెంట్ పోలేదు. ఎక్కడి నుంచి తెస్తున్నరో.. ఎలా ఇస్తున్నరో తెలియదు. నిరంతర విద్యుత్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
– ఏనుగు సైదిరెడ్డి, మోటర్ వైండింగ్ వర్కర్,
సమైక్య పాలనలో కరెంట్ గంటకు రెండు మూడుసార్లు పోయేది. ఎప్పుడు వచ్చేది కూడా తెలియక చాలా ఇబ్బందులకు గురయ్యాం. ఒకానొక సమయంలో ఆయిల్ ఇంజిన్ పెట్టుకున్నాం. దాంతో ఖర్చులు ఎక్కువై లాభాలు లేకుండా పోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిరంతర విద్యుత్ వస్తున్నది. 24గంటల కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. దాంతో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిండి గిర్ని నడుపుతున్నా. రోజూ ఖర్చులు పోను రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నా.
– కటకం పద్మ, తుంగతుర్తి
మాది ఐరన్ దుకాణం. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండేవి. ఒక పూట మొత్తం కరెంట్ ఉండేది కాదు. కస్టమర్లు ఐరన్ తీసుకుంటే వాటి కటింగ్ కోసం కరెంట్ కావాలి. గంటల తరబడి కరెంట్ లేక వినియోగదారులు ఇబ్బంది పడేవారు. దాంతో మేము జనరేటర్ ఏర్పాటు చేశాం. పెట్రోల్ ఖర్చులు వినియోగదారుల మీద వేసేవాళ్లం. ఎండాకాలంలో పవర్ హాలిడే ప్రకటించేది. తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ పోయే సమస్య లేదు. పనులు మంచిగా జరుగుతున్నాయి. మా దుకాణం ముందు జనరేటర్లు తీసేశాం.
– శంకర్శెట్టి కోటేశ్వర్రావు, వ్యాపారి, కోదాడ
నేను ఫొటో స్టూడియో, జిరాక్స్ షాపు నడిపిస్తాను. సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడూ సరిగ్గా ఉండకపోయేది. రోజు మొత్తంలో రెండు నుంచి మూడు గంటల కంటే ఎక్కువ ఉండేది కాదు. కస్టమర్లు వచ్చినప్పుడే కరెంట్ పోయేది. దీంతో గిరాకీ లేక షాపులో ఖాళీగా కూర్చునేది. కిరాయి కట్టడానికి ప్రతి నెలా ఇబ్బంది పడేటోళ్లం. తప్పని పరిస్థితిలో రూ.20వేలు పెట్టి జనరేటర్ తీసుకున్నా. కిరోసిన్ పోసి జిరాక్స్, ఫొటోలు తీసేది. అయినా చాలా ఇబ్బంది వస్తుండడంతో జనరేటర్ అమ్మేసి ఇన్వర్టర్ తీసుకున్నా. నాణ్యమైన కరెంట్ రాక రెండు సార్లు ఇన్వర్టర్ కాలిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాణ్యమైన 24గంటల కరెంట్ వస్తున్నది. ఇప్పుడు ఏ ఇబ్బందీ లేదు. జనరేటర్ నడిపే బాధ తప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్కే నా ఓటు.
– నర్సింగ్ శోభన్, జాజిరెడ్డిగూడెం