ఆలేరు టౌన్, మే 13: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే పాడి రైతుల అభ్యున్నతి కోసం రూ.2వేల కోట్లు ఇచ్చామని మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆలేరులోని పాల శీతలీకరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మదర్ డెయిరీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అయితే వేదికపై ఉన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలోనే మదర్ డెయిరీ అప్పుల్లో కూరుకపోయిందని పేర్కొన్నారు. దీంతో శ్రీకర్రెడ్డి జోక్యం చేసుకొని చిట్యాలలోని 30 ఎకరాల స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెడితే ఆ స్థలం అమ్మకుండా తాను కేసు వేశానన్నారు. అందువల్లే డెయిరీ ఆస్తుల అమ్మకం నిలిచిపోయిందని గుర్తు చేశారు.
ప్రభుత్వం మళ్లీ రాజీకి వస్తే ఉద్యోగులు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేసు విత్డ్రా చేసుకుంటే ఎన్డీడీబీ రూ.10 కోట్లు ఇచ్చిందన్నారు. రూ.10 కోట్లకే ప్రస్తుత ప్రభుత్వం ఆర్భాటం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ రూ.2 వేల కోట్లు కేటాయించి ప్రతి పాడి రైతుకు బర్రెలు, గొర్రెలు, పశుదాణా అందించిన రోజున కూడా తాము ఇంత ఆర్భాటం చేయలేదన్నారు. తన హయాంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే సీబీఐ విచారణకు సిద్ధమని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. సభలో నాయకులు ఎక్కువగా ఉన్నారు, పాల సంఘం చైర్మన్లు తక్కువగా ఉన్నారనడంతో సభ రసాభాగా మారింది.
ఈ విషయంపై రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో, ఉన్న వాస్తవాలు చెబితే ఉలుకెందుకని శ్రీకర్రెడ్డి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. 25 సంవత్సరాలుగా పాల సంఘం చైర్మన్గా పనిచేశామని ఎమ్మెల్యే చెబుతున్నారని, పదేండ్లలో 5 బర్రెలు వచ్చాయని చెబుతున్నారని, కానీ ఒక్క రైతుకు ఒక్క బర్రెనే రావాలని, 5 బర్రెలు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పాడి రైతుల సభలో కాంగ్రెస్ నాయకుల ను పెట్టుకొని సభను నడిపించడం సమంజసమేనా అని శ్రీకర్రెడ్డి ప్రశ్నించారు.