నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : భారత సమాఖ్యలో తెలంగాణ విలీనమైన సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు జిల్లాల వారీగా ముఖ్య అతిథులను ప్రకటించింది. నల్లగొండ జిల్లా
కేంద్రంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి, గౌరవ వందనం స్వీకరించనున్నారు.
ఈ సందర్బంగా అమరవీరులను స్మరించుకోనున్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోనున్నది. తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్న సమైక్యతా దినోత్సవంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా అంతటా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఎక్కడికక్కడే ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రతి అంశాన్ని మతంతో ముడిపెట్టి సమాజంలో చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను ఈ సందర్భంగా ప్రజల్లో ఎండగట్టాల్ని సూచించారు.