నల్లగొండ, జూలై 19 : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతుల ముంగిటకే ఏటీఎం సౌకర్యం తీసుకొస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఒక ఏటీఎం వాహనం పర్యటిస్తూ నగదు సేవలను అందిస్తుండగా, మరో మొబైల్ ఏటీఎం సోమవారం అందుబాటులోకి వచ్చింది. త్వరలో మరో వాహనం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా డీసీసీబీ ఏర్పాట్లు చేస్తున్నది. రూ.12 లక్షల సామర్థ్యం కలిగిన ఈ ఏటీఎంలు.. వాహనంలో నగదు నిల్వలు అయిపోతే సమీపంలోని బ్రాంచి నుంచి నగదు తీసుకుని సేవలను కొనసాగిస్తాయి.
రాష్ట్రంలో 9 సహకార జిల్లా కేంద్ర బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న రైతులకు వాణిజ్య బ్యాంకుల తరహాలో ఏటీఎం కార్డులను అందజేసి జిల్లా కేంద్ర బ్యాంకులతో పాటు పలు బ్రాంచీల సమీపంలో ప్రభుత్వం ఏటీఎంలు ఏర్పాటు చేయించింది. ఉదయం 6నుంచి రాత్రి 10 గంటల వరకు డబ్బులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. అయితే.. రైతుల వద్దకే వెళ్లి సేవలు అందించేలా జిల్లా సహకార కేంద్రానికి ఒక మొబైల్ ఏటీఎంను అందజేసింది. రూ.14 లక్షలు వెచ్చించి ఈ ఏటీఎం వాహనం ఇవ్వగా.. అందులో రూ.12 లక్షల నగదు పెట్టుకుని షెడ్యూల్ ప్రకారం వాహనం పర్యటించి సేవలు అందజేస్తున్నది. ప్రధానంగా సంతలు ఉన్న సమయంలో, ప్రత్యేక ఈవెంట్లు జరుగుతున్న ప్రాంతాల్లోనూ ఈ ఏటీఎం వాహనం పర్యటిస్తున్నది.
ఏటీఎం వినియోగంపై రైతులకు అవగాహన..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో 107 సహకార సంఘాలు, 30 బ్యాంకు బ్రాంచీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఖాతాలు తీసుకున్న రైతుల్లో 1.50 లక్షల మందికి రూపే కార్డులు అందజేశారు. అయితే.. ఎక్కువ మంది రైతులు నిరక్షరాస్యులు కావడంతో 70 శాతం వాటిని వినియోగించడం లేదు. ఈ నేపథ్యంలో మొబైల్ ఏటీఎం వాహనం ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతులకు నగదు సేవలు అందజేయడంతోపాటు ఏటీఎంను వినియోగించే విధానంపై అవగాహన కల్పిస్తున్నది.
జిల్లాలో విస్తరించనున్న మొబైల్ ఏటీఎం సేవలు..
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో సహకార బ్యాంకు ఆధ్వర్యంలో పర్యటిస్తున్న మొబైల్ ఏటీఎం సేవలకు సానుకూల ఫలితాలు వస్తుండటంతో ప్రభుత్వం తాజాగా మరొకటి కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏటీఎంలు మంచి ఫలితాలు ఇస్తుండటంతో త్వరలో జిల్లాకు మరో వాహనం కేటాయించే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు ఒక్కో వాహనం చొప్పున సేవలు అందించనున్నాయి. ఈ వాహనం ఒక్కో రోజు కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని ఆయా గ్రామాల్లోకి వెళ్లి నగదు సేవలు అందించనుంది. దీంతో రైతులు డబ్బు కోసం బ్యాంకులకు వెళ్లకుండా గ్రామానికి వచ్చే మొబైల్ ఏటీఎం ద్వారానే తీసుకోవచ్చు.