మిర్యాలగూడ, మే 26 : మిర్యాలగూడ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పర్యటన విజయవంతమైంది. వేములపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రులకు ఘన స్వాగతం పలికారు. ఉదయం 10.40గంటలకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి గ్రామపంచాయతీ భవనం, బస్తీ దవాఖానను ప్రారంభించారు. అనంతరం మిర్యాలగూడకు సుమారు 3వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తరలివెళ్లారు. 12.10 గంటలకు మిర్యాలగూడ ఏరియా దవాఖానలో 10 వెంటిలేటర్ల సౌకర్యం ఉన్న ఐసీయూ వార్డును మంత్రులు ప్రారంభించారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో రూ.16 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్కు బయలుదేరి నియోజకవర్గవ్యాప్తంగా రూ.5.60 కోట్లతో నిర్మించే 28 హెల్త్ సబ్ సెంటర్ భవణ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ఎండను సైతం లెక్క చేయకుండా సుమారు 8 వేల మందికి పైగా బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మీయ సమ్మేళనానికి తరలివచ్చారు. మంత్రుల ప్రసంగం అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భోజన ఏర్పాట్లు చేయగా అక్కడి నుంచి ఇందిరమ్మ కాలనీలో బస్తీ దవాఖాన ప్రారంభించి నేరేడుచర్ల వెళ్లారు. కార్యక్రమాల్లో ఎస్పీ రెమా రాజేశ్వరి, అడిషనల్ కలెక్టర్ కుష్భుగుప్తా, డీఎస్పీ వెంకటగిరి, ఎంపీపీలు నూకల సరళాహనుమంతరెడ్డి, నందినీరవితేజ, పుట్టల సునీత, వేములపల్లి జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ, బీఆర్ఎస్ నాయకులు నల్లమోతు సిద్ధార్థ, అన్నభీమోజు నాగార్జునచారి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎన్.కరుణాకర్రెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
భాస్కర్రావు ముచ్చట గట్లుంది ;మంత్రి జగదీశ్రెడ్డి పిట్ట కథ
సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరడంపై ఓ పిట్ట కథను చెప్పారు. ఓ ఇంటికి మేనల్లుడు వచ్చాడు. ఆమెకు అన్న కొడుకు కాబట్టి భర్త తరుపు వారి కంటే పుట్టింటి వారు వస్తే ఎక్కువ ప్రేమ చూపిస్తారు. దీంతో మొదటి రోజు మాంసం తెచ్చి మంచిగ వండి పెట్టింది. రెండో రోజు ఇంట్లో ఉన్న నాటు కోడి కోసి పెట్టింది. మూడో రోజు కూడా ఉంటే బయట నుంచి చికెన్ తెప్పించి వండి పెట్టింది. ఇగ నాలుగో రోజు కూడా పోట్లేదట. తింటుండు ఇక్కడే తిష్ట వేసి ఉంటుండు. ఇగ లాభం లేదనుకుని ఇంటికాడ అయ్యా అమ్మ ఎదురు చూస్తున్నాల కదా.. పోవాలి కదా.. ఆలస్యం అయితుంది పొద్దుగాల బస్సు ఉంది. రాత్రి వండిన చద్దన్న ఉంది కోడి గుడ్డు ఏస్తా తిని పో అందట. దీంతో మేనల్లుడు నిమ్మలంగా ఎందుకు అత్తా ఉన్న చద్దన్నం తింట, నువ్వు వండినదాక ఉండి అది కూడా తినే పోతా. ఇప్పుడేం పోను అని అన్నడట. భాస్కర్రావు ముచ్చట గట్లుంది. నియోజకవర్గానికి తేవాల్సిన నిధులు నాకంటే ఎక్కువ తెచ్చిండు. అభివృద్ధి చేసిండు. ఇంకా అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్నడని పేర్కొన్నారు.