KTR | ఆస్ట్రేలియాలోని బోండీ ప్రాంతంలో గతేడాది డిసెంబర్లో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించి దాదాపు 20 మంది ప్రాణాలను రక్షించారు రహ్మత్ పాషా. ఇతను హైదరాబాద్కు చెందిన వ్యక్తి. ఆయనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలను కాపాడినందుకు రహ్మత్ పాషాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా (Permanent Residency) కల్పించడం ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా తెలుగు సమాజానికి గర్వకారణమని అన్నారు. ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.
బోండీ బీచ్ సమీపంలో ఒక ప్రయాణికుడిని దింపిన అనంతరం పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. మొదట వాటిని బాణాసంచా శబ్దాలుగా భావించాను. వాహనం దిగి చూడగా ఇద్దరు దుండగులు కాల్పులు జరుపుతున్న దృశ్యాన్ని గమనించాను. ఆ సమయంలో వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా, అక్కడి నుంచి పారిపోకుండా గాయపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, అనేక మంది ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించాను అని ఆనాటి సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు రహ్మత్ పాషా. అతని ధైర్యాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు శాశ్వత నివాస హోదా కల్పించింది. అంతేకాదు బ్రేవరీ అవార్డు (Bravery Award)కు కూడా నామినేట్ చేసిందని సమాచారం. అలాగే ఆయన పనిచేస్తున్న రైడ్-షేరింగ్ సంస్థ కూడా ఆయనను ప్రత్యేకంగా అభినందించింది.
ఈ సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నిశీధర్ బొర్రా, వేణు పాల్గొన్నారు.