యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఒక్కొక్కటిగా పాతర వేస్తున్నది. ఇటీవల వరకు సమర్థవంతంగా అమలైన కార్యక్రమాలను ఆపేస్తున్నది. చేనేత కార్మికుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చేనేత మిత్ర పథకానికి మంగళం పాడే ప్రయత్నాలు చేస్తున్నది. నేతన్నలకు నెలకు రూ.3వేల ఆర్థిక సాయాన్ని అందించకుండా అటకెకిస్తున్నది. దీనిపై చేనేత కార్మికులు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నల బతుకులు అస్తవ్యస్తంగా ఉండేవి. సరారు తోడ్పాటు లేక వారి కుటుంబ పరిస్థితులు దుర్భరంగా మారి జీవితం వెల్లదీయడమే కష్టంగా ఉండేది. పనిలేక, ఉపాధి కరువై అప్పుల పాలయ్యేవారు. తెచ్చిన అప్పులు, మిత్తీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ.. స్వరాష్ట్రంలో నేతన్నల బతుకులు మారాయి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది. నేతన్నలకు పొదుపు పథకం, పింఛన్లు, రాయితీలు, పావలా వడ్డీ రుణ మాఫీ, ఆధునిక ఆసు యంత్రాల పథకం, నేతన్నకు బీమా పథకాలను అమలు చేసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేత కార్మికుల కోసం చేనేత మిత్ర పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద నూలు, రసాయనాలు, ముడి సరుకులకు సబ్సిడీ ఇచ్చేది. నూలు, సిల్, ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై 40శాతం సబ్సిడీ కల్పించేది. దీంతో జిల్లాలో రూ.38 కోట్ల సబ్సిడీ చేనేత కార్మికులకు అందింది. అయితే.. సబ్సిడీ పొందడం నేతన్నలకు ఇబ్బందిగా మారింది. జీఎస్టీ బిల్లులు, ఆన్లైన్లో దరఖాస్తు తదితర విధానంతో సబ్సిడీ పొందలేకపోతున్నారని అప్పటి సరార్ గుర్తించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పథకంలో మార్పు చేసింది. అర్హులైన నేతన్నలకు రూ.3వేల సాయం చేయాలని నిర్ణయించింది.
గతేడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మార్పు చేసిన పథకం అమల్లోకి వచ్చింది. ఒకో కుటుంబానికి రూ.3వేలు అందాయి. అందులో రూ.2వేలు నేత కార్మికుడికి, వెయ్యి అనుబంధ కార్మికుడి (భార్య లేదా కుటుంబ సభ్యులు) ఖాతాల్లో జమ అయ్యాయి. ఒక వేళ అనుబంధ కార్మికులు ఇద్దరు ఉంటే ఒకొకరికి రూ.500 చొప్పున జమ చేశారు.
నేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినా ఇప్పటికీ ఒక్క పైసా విడుదల చేయలేదు. జిల్లాలో మొత్తం 10,600 మంది అర్హులు ఉండగా.. అందరూ ఆర్థిక సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అసలు ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందా.. లేదా? ఇతర పథకాల లెక మంగళం పడుతుందా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చేనేత రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించకపోవడంతో ఆ పథకాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. గత ఆగస్టు, నవంబర్ నెలల్లో జియో ట్యాగింగ్ కలిగిన నేతన్నలకు రూ.2వేలు, ఇద్దరు అనుబంధ కార్మికులకు ఒకొకరికి రూ.500 చొప్పున మొత్తం మూడు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేసేవారు. ఇప్పుడు వాటి గురించి అడిగేవారు కరువయ్యారు. ఈ విషయమై నాయకుల దృష్టికి తీసుకెళ్లాం. చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– చింతకింది రమేశ్, చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
కేసీఆర్ పాలనలో చేనేత మిత్ర పథకం కింద నేతన్నకు రెండు వేల రూపాయలు ఖాతాలో వేసేవాళ్లు. ఆ గవర్నమెంట్ పోయినంక ఆ పథకం ఊసే లేదు. కార్మికులను ఆదుకునేది పోయి ఉన్న పథకాలే బంద్ చేస్తుండ్రు. నేసిన వస్త్రాలు కొనుగోలు చేయట్లేదు. పని కల్పించరు. గతంలో కార్మికుల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో నెలకు సుమారు 6వేల రూపాయలు వచ్చేటివి. ఈ గవర్నమెంట్ వచ్చాక ఏదీ లేదు.
– ఈపూరి బాలయ్య, చేనేత కార్మికుడు, భూదాన్ పోచంపల్లి