నల్లగొండ ప్రతినిధి, మే 29 (నమస్తే తెలంగాణ) ; రెవెన్యూ శాఖలో పారదర్శక సేవలతోపాటు వ్యవసాయంలో వివిధ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ విజయవంతంగా సాగుతున్నది. మొదట చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా ఒక్కో దాన్ని అధిగమిస్తూ పూర్తి స్థాయి సేవలతో ప్రస్తుతం రైతుల మన్ననలను పొందుతున్నది. ప్రారంభమైన 31 నెలల్లో వేలాది రిజిస్ట్రేషన్లతో పాటు భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపుతూ ధరణి పోర్టల్ విశేష ఆదరణ చూరగొన్నది. సరైన డాక్యుమెంట్లతో నేరుగా మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుంటే నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్తోపాటు మ్యుటేషన్, ఆ వెంటే పట్టాదారు పాస్ పుస్తకం కూడా నేరుగా భూ యజమానులకు అందుతున్నది. దాంతో గతంలో మాదిరిగా లంచాల రూపంలో అదనపు డబ్బుతో పని లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పోయింది. ఏదైనా భూసమస్య ఉంటే కూడా గతంలో వీఆర్ఓ మొదలుకుని తాసీల్దార్, ఆర్డీఓ ఇలా కలెక్టర్ కార్యాలయం వరకు తిరిగి వేసారి పోయేవారు. కానీ నేడు వాటికి కూడా మీ సేవలో ఫిర్యాదు చేస్తే నేరుగా కలెక్టర్ లాగిన్లో పరిష్కారం లభిస్తున్నది. దాంతో డబ్బు, సమయం ఆదా అవుతున్నది. వ్యవసాయంలో కీలకమైన రైతు బంధు, రైతుబీమా తోపాటు అన్ని రకాల పథకాల్లో ధరణి పోర్టల్ సమాచారమే కీలకంగా మారింది. ఇటీవల పంట నష్ట పరిహారంలోనూ దీన్నే ప్రామాణికంగా తీసుకోవడం గమనార్హం.
గతంలో గిఫ్ట్ డీడ్ వంటి వాటికి కూడా చాలా ఇబ్బందులు వచ్చేవి. ముఖ్యంగా తిరుగుళ్లకు, లంచాలకు భయపడి తర్వాత చేసుకోవచ్చులే అనే భావనలో ఉండిపోయేవారు. గతంలో వ్యవసాయ భూములను కొన్నాక పట్టాదారు పాసుపుస్తకం చేతికి రావాలంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల వరకు వేచి చూడాల్సి వచ్చేది. లక్షలు పోసి భూములను కొన్నా పాసుపుస్తకం చేతికొచ్చే వరకు ఆ భూమి తనదే అవుతుందో, లేదోనన్న సందేహాలు వెంటాడేవి. దీనికితోడు అవినీతికి అలవాటు పడిన కొందరు రెవెన్యూ సిబ్బందితో అనుభవించే మానసిక క్షోభ అంతాఇంతా ఉండేది కాదు. ఇవన్నీ ఏండ్ల తరబడిగా వస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ దీనిపై దృష్టి పెట్టినవాళ్లు లేరు. భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న పట్టుదలతో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. భూ రికార్డుల ప్రక్షాళనతోపాటు ధరణి పోర్టల్ రూపకల్పన అందులో అతిపెద్ద ముందడుగుగా నిలిచింది. అంతకుముందు ఉన్న రికార్డుల డిజిటలైజేషన్ ఆధారంగా పోర్టల్ను తీర్చిదిద్దారు. అయితే.. వీటిల్లో ప్రారంభంలో ఏ సమస్యా లేని భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న అంశాలపైనా రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా దృష్టి సారించింది. ఇలా ఒక్కో సమస్యకు పరిష్కారం చూపుతూ అదనపు ఆప్షన్లను కల్పిస్తూ దరఖాస్తులను స్వీకరించింది. ఇలా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారాలను ఆయా జిల్లా కలెక్టర్లకు మాత్రమే అనుమతించింది. దీంతో ఈ దరఖాస్తులన్నీ మీ సేవ కేంద్రాల ద్వారా నేరుగా కలెక్టర్ లాగిన్లోకి వచ్చి పడ్డాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. తిరిగి వీటన్నింటినీ సంబంధిత తాసీల్దార్లకు పంపిస్తూ క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులపై రిపోర్టులను తెప్పించుకుంటున్నారు. ఇలా వచ్చిన రిపోర్టుల ఆధారంగా ఒక్కో సమస్యకు నేరుగా కలెక్టర్లే తిరిగి పరిష్కారం చూపుతూ క్లియర్ చేస్తున్నారు. దీంతో మధ్యవర్తులు, పైరవీకారులకు స్థానం లేకుండా పోయింది.
తాసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక వసతులు
ధరణి పోర్టల్ ఉమ్మడి జిల్లాలో అందుబాటులోకి వచ్చాక రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా నమోదవుతున్నది. ఆయా మండలాల్లోని తాసీల్దార్ కార్యాలయాలన్నింటినీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లుగా తీర్చిదిద్దారు. వీటిల్లో ఏ మండల పరిధిలోని భూములు అక్కడే రిజిస్ట్రేషన్తోపాటు మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం తాసీల్దార్ కార్యాలయంలోనే ప్రత్యేక గదులను కేటాయించారు. ప్రత్యేక కంప్యూటర్లు, స్కానర్లు, నెట్ కనెక్షన్, ఇతర టెక్నికల్ పరికరాలను సమకూర్చారు. అదేవిధంగా క్రయవిక్రయాలకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా ఒక్కో తాసీల్దార్ కార్యాలయంలో రూ.10లక్షలతో ప్రత్యేకంగా మౌలిక వసతులను కూడా కల్పించారు.
చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ అయ్యింది..
మాది నల్లగొండ మండలంలోని పెద్దసూరారం. నాకు 2019లో పెళ్లి అయ్యింది. మా తల్లిదండ్రులు ఒక ఎకరం భూమి ఇస్తానని చెప్పిండ్రు. మా నాయనమ్మ పేరున ఉన్న ఎకరం భూమిని గిఫ్ట్ కింద రిజిస్ట్రేషన్ కోసం ఒక రోజు ముందు మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా. ఉదయం 11:30 గంటలకు రిజిస్ట్రేషన్ సమయం ఇచ్చారు. తాసీల్దార్ కార్యాలయానికి వచ్చాక డాక్యుమెంట్ పత్రాలు పరిశీలించిన అధికారులు అరగంటలోనే రిజిస్ట్రేషన్ పత్రాలు చేతిలో పెట్టారు. ధరణి రాకముదు భూమి రిజిస్ట్రేషన్ కోసం దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. ధరణితో రైతులు, సామాన్యులకు సేల్ డీడ్, వారసత్వం, భాగ పంపిణీ, గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్లు సాఫీగా జరుగుతున్నాయి. గతంలో భూములు పట్టా చేసుకునేందుకు వీఆర్ఓల దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా కాకపోయేది.
– సూదిరెడ్డి సాహితి, పెద్దసూరారం, నల్లగొండ (రూరల్)
సమస్యలపై నిరంతర దృష్టి
ఓ వైపు సరైన డాక్యుమెంట్లు, వివరాలతో కూడిన భూముల రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తూనే.. మరోవైపు గత రెవెన్యూ రికార్డుల్లోని తప్పొప్పులను సరిచేసే ప్రక్రియ కూడా నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. పలు కారణాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల నుంచి ఫిర్యాదులను నేరుగా మీ సేవ కేంద్రాల ద్వారా స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటివరకు 33 ట్రాన్జాక్షన్స్ మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేటివ్ మాడ్యూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో రకమైన భూ సమస్య కోసం ఒక్కో ఆప్షన్ కల్పించారు. వీటి ద్వారా ఫిర్యాదు చేస్తే నేరుగా అది కలెక్టర్ లాగిన్లోకి వెళ్తుంది. ఇలాంటి వాటిల్లో ప్రధానంగా సర్వే నెంబర్లలో తప్పులు, భూముల విస్తీర్ణాల్లో ఎక్కువ తక్కువలు, ధరణి కంటే ముందు రిజిస్ట్రేషన్ పూర్తయి పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లు, ఎన్ఆర్ఐలకు పట్టాదారు పాసు పుస్తకాల జారీ, ఆధార్ సీడింగ్ లేనివి, నాలా పర్మిషన్లు, మ్యుటేషన్ అయినా కొత్త పాసుబుక్ లేనివి, డిజిటల్ సంతకాలు కానివి ఎక్కువగా వస్తున్నట్లు రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నది. ఇలా వచ్చిన వాటిని ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన క్లియర్ చేయాలని స్పష్టంగా ఆదేశించడంతో కలెక్టర్లు ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు, రికార్డుల ఆధారంగా కలెక్టర్లు వీటికి పరిష్కారం చూపుతున్నారు. ఈ పద్ధతిలో నేరుగా భూ యజమానులు ఏ కార్యాలయానికీ తిరుగాల్సిన అవసరం లేకుండా పోయింది. రెవెన్యూ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అవినీతి, అలసత్వాలకు చెక్ పెడుతూ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఓ సాహాసోపేత నిర్ణయమని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్న ప్రజలు, వారి కుటుంబ సభ్యులు కొత్త విధానంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు కేసీఆర్ సార్తోనే సాధ్యమంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
గంటలోనే మ్యుటేషన్
గతంలో భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే పాస్ పుస్తకాన్ని పరిశీలించి అసలుదా, నకిలీదా తెలుసుకొని సాక్షులను విచారించేది. దేవరకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రోజులకొద్ది ఎదురుచూసి సంతకాలు పెట్టేది. ఆ రిజిస్ట్రేషన్కు ఎవరూ అడ్డుపడకుండా ఉండాలంటే 90 రోజులు ఆగాల్సి వచ్చేది. కానీ.. నేడు అలాంటి పరిస్థితి లేదు. స్లాట్ బుక్ చేసుకొని తాసీల్దార్ కార్యాలయానికి వచ్చిన గంటలోనే ఆన్లైన్లో రికార్డులు పరిశీలించి రిజిస్ట్రేషన్తోపాటు మ్యుటేషన్ కూడా చేసి సంబంధింత నకళ్లను వెంటనే ఇస్తున్నారు. ధరణి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు హ్యాట్సాప్.
– ఎన్.స్వామి, కట్టకొమ్ముతండా (దేవరకొండ రూరల్)
ధరణి వచ్చినంక భూ సమస్యలు పోయాయి
ధరణి వచ్చినంక భూ సమస్యలు తొలగిపోయాయి. భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా పోర్టల్ను పకడ్బందీగా తయారు చేశారు. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవడం నుంచి భూమి రిజిస్ట్రేషన్ వరకు ఆన్లైన్లో పారదర్శకంగా అంతా పక్కాగా జరుగుతున్నది. కొనుగోలు చేసిన వారికి వెంటనే నమూనా పాస్ పుస్తకం ఇవ్వడం, అమ్మిన వారి ఖాతా నుంచి భూమి మారిపోవడం చకాచకా చేస్తున్నారు మేము ఎకరం భూమి కొన్నం. స్లాట్ బుక్ చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లాం. తాసీల్దార్ ఇరువర్గాల నుంచి వేలిముద్రలు తీసుకొని మాకు వెంటనే పాస్ పుస్తకం ఇచ్చారు. 10 రోజుల తర్వాత ఒరిజినల్ పాస్బుక్ ఇంటికి వస్తదని చెప్పారు. పైరవీలు లేకుండానే రిజిస్ట్రేషన్ కావడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ధరణిని తీసుకొచ్చి రైతుల ఇబ్బందులను తీర్చారు. రైతుల కోసం ఆలోచించే సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. జీవితాంతం ఆయనకే మా ఓటు.
– రమావత్ అరుణ, ఫకీర్పురం, కొండమల్లేపల్లి
నేను హైదరాబాద్లో నివాసం ఉంటున్నా. హాలియా శివారు అనుముల గ్రామంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాను. ధరణి ఉండబట్టే ధైర్యంగా ఇక్కడ భూమిని కొన్నాను. ధరణి లేకుంటే భూమి కొనాలంటే తాసీల్దార్ కార్యాలయానికి వచ్చి రెవెన్యూ రికార్డులు చూడాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోయి వన్ బీ తీసుకోవాలి. డబుల్ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి. ధరణితో భూముల రిజిస్ట్రేషన్లలో కష్టాలు, నష్టాలు పూర్తిగా తొలగిపోయాయి. ధరణి ద్వారా వివరాలు ఆన్లైన్లో పెట్టడంతో భూముల వివరాలు పూర్తిగా తెలుస్తున్నాయి. గతంలో భూమిని కొనుగోలు చేస్తే బ్యాంకులో చలానా తీసి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వచ్చేది. భూమి కొన్న తర్వాత రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించడానికి తాసీల్దార్ కార్యాలయం, పట్వారీ చుట్టూ తిరుగాల్సి వచ్చేది. పట్వారీ కరుణిస్తేనే పట్టాదారు పాస్బుక్ వచ్చేది. మ్యుటేషన్ అయ్యేది. ధరణి వచ్చిన తర్వాత క్షణాల్లో రిజిస్ట్రేషన్, ఆ వెంటనే మ్యుటేషన్, వారానికే పాస్బుక్ ఇంటికే వస్తున్నది. ఇది ఎంతో బాగుంది. కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తామనడం పేదలను కష్టాలకు గురిచేయడమే. అక్రమార్కులకు వంతపాడటమే అవుతుంది.
– శివరాంరెడ్డి, హైదరాబాద్ (హాలియా)
దళారీల ప్రమేయం పోయింది
నకిరేకల్ మండలం నోముల గ్రామ పరిధిలో నాకు ఎకరం 20 గుంటల భూమి ఉన్నది. 20 గుంటల భూమిని ఇటీవల అమ్మాను. పట్టా చేసేందుకు తాసీల్దార్ కార్యాలయానికి వచ్చా. ఏడు నిమిషాల్లోనే కొనుగోలు చేసిన వారి పేరున రిజిస్ట్రేషన్ అయిపోయింది. గతంలో రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. సర్వర్ సమస్య ఉన్నదని రెండు, మూడు రోజులు తిప్పేవాళ్లు. ధరణి పోర్టల్ వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్లు చాలా సులువుగా అవుతున్నాయి. మధ్య దళారీల ప్రమేయం తగ్గింది. నేరుగా వచ్చి స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ ఫీజు తప్ప ఎక్కడా ఖర్చు కాలేదు. సరళమైన విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– దాచేపల్లి నాగేశ్వర్రావు, రైతు, నకిరేకల్
గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగినా పని కాలే
మాది గురజాల గ్రామం. బతుకుదెరువు కోసం కొన్నేండ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లి జీవనం సాగిస్తున్నాం. నాకు ఆరేండ్ల వయస్సు ఉన్నప్పుడు మా ఊళ్లో సర్వే నంబర్ 152లో 35గుంటల భూమిని మా నాన్న కొన్నాడు. కానీ.. మా నాన్న పేరు మీద పట్టా కాక నానా ఇబ్బందులు పడ్డాం. రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా పని కాలేదు. అప్పట్నుంచి కబ్జాలో ఉన్నా.. పట్టా చేయలేదు. ధరణి పోర్టల్ ద్వారా ఈ నెల 27న స్లాట్ బుక్ చేసుకున్నాం. సోమవారం తాసీల్దార్ కార్యాలయంలో నాకు పట్టాకు సంబంధించిన భూమి పత్రాలను ఇచ్చిండ్రు. పట్టా కాదనుకున్న భూమి నా పేరు మీద కావడంతో సంతోషంగా ఉన్నది.
– చాట్ల పరశురాములు, గురజాల, శాలిగౌరారం మండలం