చిట్టెం నర్సిరెడ్డి హైలెవల్ లెఫ్ట్ కెనాల్ పాసేజ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిట్టెం
మక్తల్ టౌన్/రూరల్, జూన్ 6: చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్ద్వారా వానాకాలం పంటల సాగుకు సంబంధించి ఆయకట్టు రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్ హైలెవల్ లెఫ్ట్ కెనాల్ పాసేజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్ హైలెవల్ లెఫ్ట్ కెనాల్ పాసేజ్ పనులు త్వరగా చేపట్టాలని తెలిపారు. నిన్న మొన్న కురిసిన వర్షాలకు హైలెవల్ లెఫ్ట్ కెనాల్పై పాసేజ్ నిర్మాణం కూలిపోవడంతో కెనాల్ ద్వారా సాగునీరు వెళ్లేందుకు వీలులేదని సాగునీరు వెళ్లే విధంగా పాసేజ్ నిర్మాణం చేపట్టాలని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కెనాల్ ద్వారా మక్తల్, నర్వ మండలంలోని 29వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. దాదాపు 19వేల ఎకరాలకు నర్వ మండలంలోని గ్రామాలకు, మిగతా మక్తల్ మండలంలోని గ్రామాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రాజీవ్భీమా ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన సంగంబండ , భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, ఎంపీపీ వనజ, మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి , జిల్లా అథ్లెటిక్ అధ్యక్షుడు నర్సింహగౌడ్, ఏఈ నాగశివ, సీనియర్ నాయకులు శ్రీనివాస్గుప్తా, సర్పంచ్ దత్తు, శేఖర్రెడ్డి, చెన్నయ్య గౌడ్, చిన్న హన్మంతు తదితరులు పాల్గొన్నారు.