భూసారానికి ఎరువు ఎంతో మేలు
పంట దిగుబడికి దోహదం
దస్తురాబాద్, జూన్22 : సేంద్రియ ఎరువుల వినియోగంతో నేలకు సహజ సిద్ధంగా బలం చేకూరుతుంది. రైతులకు ఎరువుల భారం తప్పుతుంది. భూసారానికి మేలు చేకూరుతుంది. పంట దిగుబడికి దోహదం చేస్తుంది. రైతులు పంట దిగుబడి కోసం కొన్నేండ్ల నుంచి విపరీతంగా క్రిమి సంహారక, రసాయన ఎరువులను వాడుతున్నారు. దీంతో భూసారం దెబ్బతింటున్నది. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నది. ఇందుకు సేంద్రియ ఎరువులు వాడడమే మేలు. రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తే మంచిది.
సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన..
సేంద్రియ ఎరువుల వాడడంతో కలిగే ప్రయోజనాలపై అధికారులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. సదస్సులు నిర్వహించి వివరిస్తున్నారు. ఇండ్లలో ఏడాది కాలంగా జమ చేసే పశువుల పేడ, చెత్తాచెదారంతో ఉండే పెంటతో భూమిలో సారం పెరుగుతుంది. కోడి, మేకల ఎరువులు, వ్యవసాయ భూముల్లో పశువుల మంద పెట్టించడం లాంటి పద్ధతులతో భూసారం పెరుగుతుంది. పంటల దిగుబడి అధికమవుతుందని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
నత్రజని, భాస్వరం..
అవగాహన పెంచుకుంటున్న రైతులు పెంటను ఎండ్ల బండ్లు, ట్రాక్టర్లలో తరలిస్తూ భూముల్లో పోసుకుంటున్నారు. పశువుల పేడ వేసిన తర్వాత భూమిని కలియదున్నడంతో వాటిలో ఉండే నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు సూక్ష్మ పోషకాలు కూడా తగిన మోతాదులో అందుతాయి. దీంతో మొక్క బాగుండి మంచి దిగుబడి పొందవచ్చని వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు. మరికొంత మంది రైతులు భూసారం కోసం చెరువుల పూడిక మట్టి (నల్ల మట్టి)ని సైతం తమ వ్యవసాయ భూముల్లో పోయించుకుంటున్నారు. నల్లమట్టి నీటిని ఎక్కువగా పీల్చుకొని నేలలో చాలా సమయం వరకు తేమ ఉండేలా చేస్తుంది. దీంతో మొక్కకు నీటి లభ్యత ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.