ములుగు : ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో్ గుర్తింపు సాధించిన రామప్ప ఆలయాన్ని ఇవాళ ఆమె బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కతో కలిసి సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామప్ప చెరువు వద్ద మత్తడి ప్రాంతాన్ని పరిశీలించి వరద నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.
‘తెలంగాణలో కాకతీయుల కట్టడాలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు సీఎం కేసిఆర్ ఉద్యమ కాలం నుంచే ప్రయత్నించారు. కాకతీయులు అద్భుత శిల్ప సంపద తెలంగాణలో ఉంది. రైతుల కోసం కాకతీయులు తవ్వించిన చెరువులను పునరుద్ధరించి ఘనత కూడా సీఎం కేసీఆర్దే. యునెస్కో గుర్తింపుతో రామప్ప ఆలయం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తాం. రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, పాండురంగారావు, పాపారావు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు అందరికీ ధన్యవాదాలు’ అని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆమె వెంట పలు కార్పొరేషన్ల చైర్మన్లు కుసుమ జగదీశ్వర్, వాసుదేవ రెడ్డి, మర్రి యాదవ రెడ్డి, నాగుర్ల వెంకన్న, ఇతర నేతలు, అధికారులు ఉన్నారు.
ప్రజల సంక్షేమాన్ని కోరని ప్రతిపక్షాలను పట్టించుకోం
అర్హులందరికి రేషన్ కార్డులు : మంత్రి నిరంజన్ రెడ్డి
సింగరేణిలో పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు