కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
శామీర్పేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
శామీర్పేట, మార్చి 19 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాతో సంవత్సరం గడిచిపోయిందనే విషయాన్ని ప్రజలు మరిచిపోవద్దన్నారు. కరోనా వైరస్ రెండో స్టేజ్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. బడ్జెట్లో జిల్లా పరిషత్, మండల పరిషత్లకు రూ.500 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల తరపున సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. శామీర్పేట మండల ప్రజల కోరిక మేరకు ప్రభుత్వాస్పత్రి బాధ్యత తనదేనన్నారు.
పలు సమస్యల గురించి…
అనంతరం సమావేశంలో ముందుగా అలియాబాద్ ఎంపీటీసీ సగ్గు శ్రీనివాస్యాదవ్, కోడూరి అశోక్ రెవెన్యూ నక్ష ప్రకారం శామీర్పేట-అలియాబాద్ రెవెన్యూ సరిహద్దులను పరిష్కరించాలని కోరారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా వేతనాలు చెల్లించాలని, అక్రమ వెంచర్లు, అక్రమ నిర్మాణాలపై ఎంపీటీసీలు అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లూబాయి, జడ్పీటీసీ అనితలాలయ్య, ఏఎంసీ చైర్పర్సన్ సునీతలక్ష్మి , వైస్ ఎంపీపీ ఎల్లూ సుజాత, తహసీల్దార్ సురేందర్, ఎంఈవో వసంతకుమారి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : మంత్రి
మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 19 : సీఎం కేసీఆర్ నిరుపేదల పక్షపాతి అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన చక్రపాణికి రూ. 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రికి నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్ పాండాల అనురాధ , నాయకులు యాదగిరి గౌడ్ పాల్గొన్నారు.