సంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం జడ్పీకి రూ. 50 కోట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ వెల్లడించారు. శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి కలెక్టర్తో కలిసి అధికారులతో వివిధ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పటాన్చెరు పరిధిలోని రాయనిచెరువు సమస్యను మూడు సంవత్సరాలుగా ఎందుకు పరిష్కరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు విధుల్లో నిర్లక్ష్య వహిస్తూ రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వారు ఉద్యోగాలు విడిచిపెట్టాలని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, కేసీఆర్ని మూడోసారి ముఖ్యమంత్రిగా చూస్తామన్నారు.
– సంగారెడ్డి, సెప్టెంబర్ 23
సంగారెడ్డి, సెప్టెంబర్ 23: సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ను కోరగా వెంటనే స్పందించారని, త్వరలో నిధులు మంజూరు ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశాన్ని జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన సీఈవో ఎల్లయ్య ప్రారంభించారు. సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలకు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారన్నారు.
త్వరలో జడ్పీ, మండల పరిషత్లకు మంజూరయ్యే నిధులతో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. పటాన్చెరు పరిధిలోని రాయనిచెరువు సమస్య ఎందుకు పరిష్కారం చేయడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చెరువు మధ్యలో అటవీశాఖ అధికారులు ప్రహరీ నిర్మించి, మత్య్సకారులు చేపలు పట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ విషయాన్ని మూడేండ్లుగా సమావేశం దృష్టికి తెస్తున్నా, అధికారుల్లో చలనం లేదన్నారు. ప్రభుత్వం నాలుగేండ్లు విధులు పూర్తిచేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పర్మినెంట్ చేయడం సంతోషకరమన్నారు.
కానీ వారు పనులు పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారు రాజకీయాలు చేయాలనుకుంటే ఉద్యోగాలు విడిచిపెట్టాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నాయకులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మహ్మద్ తన్వీర్, దళిత సంక్షేమ సంస్థ చైర్మన్గా నరోత్తంను నియమించడంతో సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. సమావేశంలో టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్లతో పాటు వైస్ చైర్మన్ ప్రభాకర్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నాసిరకంగా సింగూరు కాల్వ పనులు :ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
అందోల్ నియోజకవర్గంలోని పుల్కల్ మండలంలో కాంగ్రెస్ పాలనలో నిర్మించిన సింగూరు కాల్వ పనులు నాసిరకంగా ఉండడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన విషయం తెలిసిందేనని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తెలిపారు. పనులు నాసిరకంగా ఉన్న విషయం అధికారులకు తెలిసినా సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్పై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు. రూ.100 కోట్ల నిధులతో చేపట్టిన పనులను రూ.50 కోట్లతో పూర్తి చేసి నాసిరకంగా నిర్మించారని, చిన్నపాటి వరద నీటికి కాల్వలు కొట్టుకుపోతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు సంబంధిత అధికారులు తమ పాత్ర పోషించినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు. నియోజకవర్గానికి రూ.2 వేల కోట్ల నిధులు విడుదల చేసి అభివృద్ధికి మార్గాలు వేశారన్నారు.
ఎమ్మెల్యేలందరికీ నిధులు కేటాయించాం: ఎమ్మెల్సీ యాదవరెడ్డి
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో జహీరాబాద్, అందోల్ మినహా అన్ని నియోజకవర్గాలకు మంత్రి హరీశ్రావు సూచనల మేరకు నిధులు కేటాయించామని ఎమ్మెల్సీ యాదవరెడ్డి తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లలో సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ మహా మేధావి: ఎమ్మెల్యే మాణిక్రావు
ఉద్యమాలతో సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నూతన పథకాలు అమలు చేసి, ముఖ్యమంత్రి కేసీఆర్ మహా మేధావిగా గుర్తింపు పొందారని ఎమ్మెల్యే మాణిక్రావు కొనియాడారు. ప్రతి గ్రామంలో రూ.లక్షల నిధులతో గ్రామాలను అందంగా తీర్చిదిద్దారన్నారు. పల్లెలు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు విడుదల చేసి రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ లైట్ల ఇబ్బందులు తొలిగించారన్నారు. సంగారెడ్డిలో పోతిరెడ్డిపల్లి నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ వెలుగులను పట్టణవాసులకు అందించారన్నారు.