సీఎం కేసీఆర్ చొరవతో మెదక్ జిల్లా రూపురేఖలు మారిపోయాయని, అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో ఆయన పర్యటించి మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సఖీ కేంద్రం, జిల్లా గ్రంథాలయంతో పాటు రూ.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతకుముందు కలెక్టరేట్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎరుకల సాధికారత పథకాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మెదక్ సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. జిల్లా కేంద్రంలో రూ.180 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మిస్తున్నామన్నారు. మరో రూ.180 కోట్లతో 450 పడకల దవాఖానను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు జిల్లా కార్యాలయాలు సంగారెడ్డిలో ఉండడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, నేడు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషితో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, రామాయంపేట రెవెన్యూ డివిజన్, రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటయ్యాయని, రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. రైతుబంధు, 24గంటల విద్యుత్ సరఫరా, దండిగా ఎరువులు అందిస్తుండడంతో
-మెదక్ నమస్తే తెలంగాణ/మెదక్ అర్బన్/మెదక్ రూరల్, అక్టోబర్ 5
మెదక్ అర్బన్, అక్టోబర్ 5 : గతుకుల మెదక్గా పేరున్న మెదక్ను.. బతుకుల మెదక్గా మార్చిన ఘనత మన సీఎం కేసీఆర్దే అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో మంత్రి పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాకు రూ.180 కోట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేశారని, ఇప్పుడున్న దవాఖానతో పాటు అదనంగా మరో రూ.180 కోట్లతో 450 పడకలతో దవాఖానాని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కళాశాల అందుబాటులోకి వస్తే జిల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాలో సూది ఉంటే గోలి ఉండేది కాదు… గోలి ఉంటే డాక్టరు ఉండకపోవు…కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం 150 మంది డాక్టర్లతో వైద్యం అందించనున్నదన్నారు.
రోగులు ఇక్కడి నుంచి గాంధీ, నిమ్స్ దవాఖానాలకు వెళ్లే అవసరం లేకుండా అదే స్థాయి వైద్యం త్వరలో మెదక్లో అందుబాటులోకి వస్తున్నదని వెల్లడించారు. మతాశిశు సంరక్షణ దవాఖాన ఏర్పాటు చేయడంతో 100కు 82 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయని అన్నారు. డెలివరీ తర్వాత తల్లీబిడ్డను క్షేమంగా 108 అంబులెన్స్లో ఇంటి వద్ద దిగబెడుతున్నారన్నారు. ఒకప్పుడు మెదక్ జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉండేవని, అలాంటి పరిస్థితులను రూపుమాపి తళతళామెరిసే మెదక్గా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. గతంలో అన్ని కార్యాలయాలు సంగారెడ్డిలో ఉండేవని, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషితో ఇప్పుడు మెదక్లోనే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు వచ్చాయన్నారు. ఘణపురం ఆనకట్ట ఎత్తు పెంచి, కాలువలకు మరమ్మతులు చేయడంతో చిట్టచివరి భూములకూ నీరంచడంతో రైతులు సంతోషంగా రెండు పంటలు వేసుకుంటున్నారన్నారు. ఎంతో మంది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసినా తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క ఇబ్బందులు పడ్డారని, నీళ్ల కోసం రాస్తారోకోలు చేసి బిందెలు అడ్డం పెట్టేవారని గుర్తుచేశారు. అప్పట్లో ఘణపురం నీళ్లు కావాలంటే హైదరాబాద్ పోయి పైరవీ చేసేవారని, ప్రస్తుతం నీళ్లు లేవని పద్మకు ఒక్క ఫోను కూడా రావట్లేదన్నారు.
హెచ్ఆర్సీసీలో కేసులు లేవు, రోడ్డు ఎక్కుడు లేదు.. ధర్నాలు చేసుడులేదన్నారు. రాబోయే రోజుల్లో శంకరంపేట్, మెదక్ రూరల్, పాపన్నపేటకు కాలువ కింద నీళ్లు తీసుకువచ్చి రెండు పంటలు పండించుకునేలా కృషి చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎరువుల బస్తాలు, కరెంటు కోసం, పండిన పంటలు ఎవరూ కొనక అన్నదాతలు ఎన్నో అవస్థలు పడ్డారని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరంగా 24 గంటల కరెంటు సరఫరా అవుతున్నదని, మోటర్లు కాలిపోవడం లేదన్నారు. ఎరువుల నిల్వలు దండిగా ఉన్నాయని, పంటలను ప్రభుత్వమే కొంటున్నదని తెలిపారు. తొమ్మిదేండ్లలో కరు వు, కర్ఫ్యూ లేకుండా తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు.
సాగు విస్తీర్ణం పెరగడంతో నాట్లు వేసేందుకు మనుషులు దొరకడం లేదని చత్తీస్గఢ్ నుంచి మగకూలీలు వచ్చి నాట్లు వేస్తున్నారన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్ కల్పించమన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్కు రైలు తెచ్చింది, మెడికల్ కళాశాల తెచ్చింది, రామయంపేటకు రెవిన్యూ డివిజన్ తీసుకువచ్చింది, రెసిడిన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేయించిందన్నారు. కొంత మంది హైదరాబాద్ నుంచి నోట్ల కట్టలు తీసుకువచ్చి మెదక్ను ఆగం చేయడానికి చూస్తున్నారని ఎద్దేవా చేశారు. పద్మ మెదక్ ఆడబిడ్డ అని.. సాదాసీదా మనిషి, పిలిస్తే పలికే పద్మకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు.
అన్ని హంగులతో మెదక్ జిల్లాను అభివృద్ధి చేసుకున్నామని, కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సంఘానికి నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో 33 మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేయగా, మెదక్ జిల్లాకు కూడా కేటాయించారని, నర్సింగ్ కళాశాల ఏర్పాటు కూడా అందుబాటులోకి రాబోతున్నదన్నారు. నేడు మెడికల్ కళాశాలకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తైతే మెదక్లోనే మెరుగైన వైద్యసేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్, జడ్పీ వైస్చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మెదక్ ఎంపీపీ యమున, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.