జహీరాబాద్, జూన్ 12 : హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, మహిళలు పోస్టు ద్వారా లేఖలు పంపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన తపాలాకార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ సీనియర్ నాయకుడు నామ రవికిరణ్, పట్టణ కౌన్సిలర్ నామ స్రవంతి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రైల్వే అధికారులు రూపొందించిన డీఆర్పీలో బుల్లెట్ ట్రైన్ను జహీరాబాద్ మీదుగా కాకుండా వికారాబాద్ మీదుగా నడిపించేలా రూపొందించడంతో జహీరాబాద్ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తూ లేఖలు పంపారు. అనంతరం పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, నాయకురాళ్లు మాట్లాడుతూ మొదటి విడత హైదరాబాద్-ముంబయికి వెళ్లే బుల్లెట్ ట్రైన్ జహీరాబాద్ మీదుగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. అప్పట్లో సంబంధిత రైల్వే అధికారులు డీఆర్పీలో జహీరాబాద్ బుల్లెట్ ట్రైన్ నిలిపేందుకు స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు.
ప్రస్తుతం సంబంధిత రైల్వే అధికారులు తుది డీఆర్పీలో హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్లే బుల్లెట్ ట్రైన్ను జహీరాబాద్కు బదులుగా వికారాబాద్ మీదుగా వెళ్లేలా ప్రతిపాదలు సిద్ధం చేశారన్నారు. ఈ బుల్లెట్ ట్రైన్ను వికారాబాద్ మీదుగా మళ్లించడంతో జహీరాబాద్ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మొదటి డీఆర్పీ ప్రకారమే జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మ్యాడం సుధా, బిజ్జుల కవిత, చింత రేఖ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.