చేర్యాల, మార్చి 12: చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏటా తపాస్పల్లి రిజర్వాయర్ను నింపి అక్కడి నుంచి ఆయా గ్రామాల్లోని చెరువులు,కుంటలు నింపేవారు. దీంతో పంటలు ఎండిపోకుండా ఉండేవి. ప్రస్తుతం అందుకు భిన్నంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుండడంతో రైతుల సాగుచేసిన పంటలు ఎండిపోవడంతో మూగజీవాలకు వదిలిపెడుతున్నారు. దేవాదుల నీటిని విడుదల చేయకపోవడంతో చెరువులు, కాల్వలు ఎండిపోయి, జలాలు అడుగంటిపోతున్నాయి.బోరుబావులు వట్టిపోయి వరి,మొక్కజొన్న పంటలు ఎండిపోతుండడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు.
మండలంలోని పెదరాజుపేట గ్రామానికి చెందిన పిట్టల భాస్కర్ అనే రైతు రెండున్నర ఎకరాల పొలం మూగజీవాలకు పశుగ్రాసంగా మారింది. మండలంలోని ఆకునూరులో పలువురు రైతులు తమ పంటలను పశువులకు వదిలిపెట్టిన ఘటన మరువక ముందే పెదరాజుపేటలో సైతం కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మున్ముందు పరిస్ధితులు ఏ విధంగా ఉంటాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో పంటల సాగు సైతం తగ్గిందని వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు. నీటి వనరులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరించడంతో రైతుల పరిస్ధతి దీనంగా తయారైంది.