నర్సాపూర్, ఫిబ్రవరి 2: ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పూజలు చేసి మొదటి సారి అడుగుపెట్టారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో పూర్ణాహుతి, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి క్యాంప్ కార్యాలయం వేదికగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ గతంలో క్యాంప్ కార్యాలయాలను నిర్మించారని గుర్తుచేశారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ఇంకా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్కేవి జిల్లా ప్రధానకార్యదర్శి సిలువేరి వీరేశం, బీఆర్ఎస్ నాయకులు సంతోష్రెడ్డి, సత్యంగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సూరారం నర్సింహులు, షేక్హుస్సేన్, సాగర్, జ్ఞానేశ్వర్, గోపి తదితరులు పాల్గొన్నారు.