ప్రజాసమస్యల పరిష్కారానికి పెద్దపీట
సర్కారు పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యం
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూ సమస్యల పరిష్కారం
ధరణిపై అవగాహన కల్పిస్తాం
విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి
సంగారెడ్డి కొత్త కలెక్టర్ డాక్టర్.ఎ.శరత్
కలెక్టరేట్లో బాధ్యతల స్వీకరణ
అభివృద్ధిలో జిల్లాను అగ్రభాగాన నిలబెట్టేందుకు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని కొత్త కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేసినందున జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందని, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, రైతుబీమా, రైతుబంధు పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూస్తానని, మహిళా సంఘాలకు రుణాలు అందించేందుకు, ప్రభుత్వం విద్యాసంస్థల్లో బోధన, సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని వివరించారు. ‘ధరణి’తో భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, దీనిపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తానని, అధికారులు, ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని తెలిపారు. మొదటి రోజు వ్యవసాయశాఖ, డీఆర్డీఏ, వైద్య ఆరోగ్యశాఖ, ఇరిగేషన్ శాఖలపై కలెక్టర్ శరత్ సమీక్షలు నిర్వహించారు. ఎస్పీ రమణకుమార్తో పాటు టీఎన్జీవో, రెవెన్యూ ఉద్యోగుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
సంగారెడ్డి, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేస్తామని, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో సంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూస్తామని కొత్త కలెక్టర్ డాక్టర్.ఎ.శరత్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శరత్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు రుద్రారం సమీపంలోని గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లాకు రావటం సంతోషంగా ఉంది..
సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్గా మూడేండ్లు పనిచేశాను. కొత్త జిల్లాలు ఏర్పడి న అనంతరం మూడు మాసాల పాటు ఇన్చార్జి కలెక్టర్ గా వ్యవహరించాను. సంగారెడ్డి జిల్లా నైసర్గిక స్వరూ పం, పూర్తి అవగాహన ఉన్నది. కలెక్టర్ జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసినప్పటికీ సంగారెడ్డికి కలెక్టర్గా తిరిగి రావటం సంతోషంగా ఉన్నది.
ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యం..
జిల్లాలో ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరి ధరికి చేర్చేందుకు ప్రాధాన్య ఇస్తాం. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజల వద్దకు చేర్చటం కలెక్టర్గా నాబాధ్యత. ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు, జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటాం. అభివృద్ధిలో సంగారెడ్డి జిల్లాను అగ్రభాగాన నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారంపై ప్రత్యేక దృష్టి పెడతాం. రైతుబంధు, రైతుబీమా పథకాల సక్రమంగా అమలయ్యేలా చూస్తా. ఉపాధి హామీ పథకంలో పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. జిల్లా కలెక్టర్గా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాబోధన సక్రమంగా సాగేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం.
నిబంధనల మేరకు భూ సమస్యల పరిష్కారం
ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించి కలెక్టర్గా భూ సమస్యలను పరిష్కరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మకమైన కార్యక్రమం ధరణి. దీనిద్వారా రైతులకు మేలు జరుగుతున్నది. ధరణిలో ప్రభుత్వం అనేక కొత్త ఆప్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటిపై రైతులకు అవగాహన లేకపోవటంతో కొంత ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఆప్షన్లపై ప్రజలు, రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.
ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట
జిల్లా కలెక్టర్గా ప్రజాప్రతినిధులు, ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ద్వారా ప్రజలు తమ సమస్యలు తెలుపవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పరిపాలనలో మార్పులకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు స్థానికంగా ఉండటంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పనితీరును నిశితంగా పరిశీలిస్తాం.
తొలిరోజు బిజీబిజీ..
సంగారెడ్డి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డా.ఎ.శరత్ తొలిరోజు బిజీబిజీగా గడిపారు. ఉదయం కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయనను జిల్లా అధికారులను, రెవెన్యూ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులను కలిశారు. ఆ తర్వాత జిల్లాలోని పరిస్థితులపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులపై జిల్లా అధికారులను అడిగితెలుసుకున్నారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన టీఎన్జీవో, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులను కలిసి వారితో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం అధికారులతో సమీక్షలు నిర్వహించారు. వ్యవసాయశాఖ, డీఆర్డీఏ, వైద్య ఆరోగ్యశాఖ, ఇరిగేషన్ శాఖలపై సమీక్ష జరిపారు. జిల్లాలో వానకాలం సన్నద్ధత, విత్తనాలు, ఎరువుల అందుబాటు గురించి అధికారులను అడిగితెలుసుకున్నారు. వైద్య, ఆరోగ్యశాఖపై జరిపిన సమీక్షలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆతర్వాత తహసీల్దార్లు, మండల పరిషత్ అధికారులతో కలెక్టర్ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈజీఎస్ పనుల అమలుతీరు గురించి డీఆర్డీఏ అధికారులను అడిగితెలుసుకున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, డంపింగ్యార్డుల నిర్వహణపై పంచాయతీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. చెత్త నుంచి ఆదాయం సృష్టి (వెల్త్ ఔట్ ఆఫ్ వేస్ట్)పై దృష్టి పెట్టాలన్నారు.
గణేశ్ దేవస్థానంలో కొత్త కలెక్టర్ పూజలు
పటాన్చెరు, జూన్ 17: రుద్రారం గణేశ్ ఆలయంలో సంగారెడ్డి కలెక్టర్ శరత్ పూజలు చేశారు. శుక్రవారం పటాన్చెరు మండలం రుద్రారం గణేశ్గడ్డలోని సిద్ధి వినాయక దేవసానానికి కొత్త కలెక్టర్ శరత్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. కలెక్టర్ను దేవస్థానం పాలకమండలి సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికింది. శరత్ ప్రత్యేక పూజల్లో పాల్గొని వేదపండితుల ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ పాలకమండలి, సర్పంచ్ సుధీర్రెడ్డి కలెక్టర్ను సన్మానించారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో నగేశ్, మాజీ సర్పంచ్ వెంకన్న, దేవస్థానం పాలకమండలి బృందం పాల్గొన్నది.