రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ మండలంలోని వెంకటపూర్, రాజ్పల్లి, తిమ్మక్కపల్లి, బాలనగర్, సంగాయిగూడాతండా, జనకంపల్లి, చిట్యాలా, పెద్దబాయి తండాల్లో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయని ఆగం కావద్దని.. ఆలోచించి ఓటేయాలని సూచించారు. తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ఎప్పటిలానే మోసపూరిత మ్యానిఫెస్టోను ప్రకటించదని విమర్శించారు. 24గంటలు కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్కు ఓటేస్తారో, 3 గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్కు ఓటేస్తారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
మెదక్ రూరల్, నవంబర్ 19: రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదని, ఆగం కావద్దని.. ఆలోచించి ఓటేయాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ మండలంలోని వెంకటపూర్, రాజ్పల్లి, తిమ్మక్కపల్లి, బాలనగర్, సంగాయిగూడాతండా, జనకంపల్లి, చిట్యాలా, పెద్దబాయి తండాల్లో మెదక్ బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి గ్రామాల్లో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీగా వెళ్లి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. స్థానికులు పద్మాదేవేందర్రెడ్డికి శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. పద్మాదేవేందర్రెడ్డిని మహిళలు ఆడబిడ్డగా ఆదరించి పసుపు కుంకుమలు అందజేశారు. ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. ఈ సందర్భంగా మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎప్పటిలానే ఓట్లు దండుకునేందుకు మోసపూరితమైన మ్యానిఫెస్టోను ప్రకటించదన్నారు. 24 గంటలు కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్కు ఓటేస్తారో, 3 గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్కు ఓటేస్తారో ఆలోచించుకోవాలన్నారు. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుని సాగు నీరు పారించుకోవాలని చెబుతున్న వారి మాటలు నమ్మితే రైతులు ఆగమవుతారన్నారు. ఇది సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. ఇలాంటి కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రం ఆధోగతి పాలవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములు రెగ్యులరైజ్ చేస్తామన్నారు.
సౌభాగ్యలక్ష్మి పథకం మహిళలకు అండగా ఉంటుందని, అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేలు, రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. వృద్ధులకు ఆసరా పింఛన్ రూ.5016 పెంచుతామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హన్మంత్రావు మెదక్ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. 13 ఏండ్ల నుంచి ప్రజలకు దూరం ఉండి ఎన్నికల ముందువచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడని, ఎన్నికలు వస్తున్నాయంటేనే వచ్చే వాళ్లను నమ్మొద్దని అన్నారు. మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మీ బిడ్డ కావాలా, పరాయి వాళ్లు కావాలా, ఒక్కసారి మీరే ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్కు మెదక్ నియెజకవర్గం ప్రజల గురించి ఏమి తెలుసని ప్రశ్నించారు. స్వరాష్టంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న జీవితాన్ని బాగు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్ పాలనలో మెదక్ అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ తదితర కార్యక్రమాలు, దళితులకు దళితబంధు తదితర పథకాలను చేపట్టి దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలించిందన్నారు.
మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి మండలంలోని బాలనగర్తండా, తిమ్మక్కపల్లి, సంగాయిగూడ తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పద్మాదేవేందర్రెడ్డికి పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి గిరిజన మహిళల సాంప్రదాయ దుస్తులతో ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి పాటలు పాడుతూ ఆడారు.
బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో తిమ్మనగర్, తిమ్మక్కపల్లి తండాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరారన్నారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మెదక్ ఎంపీపీ యమున, వైస్ చైర్మన్ ఆంజనేయులు, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, మెదక్, మాచవర పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హన్మంత్రెడ్డి, సీతారామయ్య, రైతు బంధు మండల అధ్యక్షుడు కిష్టయ్య, సర్పంచ్లు రాజ్యలక్ష్మి, ప్రేమలత, వికాస్కుమార్, వెంకటేశం, తులసీ రవి, సిద్దాగౌడ్, నాయకులు ఎలక్షన్రెడ్డి, జయరాంరెడ్డి, సాంబశివరావు, రాములు, శ్రీనివాస్, వెంకటేశం, మోహన్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.