గోదావరి నీళ్లతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతం కోనసీమను తలపించనున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మునిపల్లి మండలంలోని చిన్నచెల్మడ గ్రామ శివారులో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను మంత్రి బుధవారం నాలుగు వేల మంది రైతుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సంగారెడ్డి జిల్లా రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటారన్నారు. నాడు వ్యవసాయమే దండుగ అన్నోళ్ల నోర్లు మూతపడేలా సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా తీర్చిద్దినట్లు తెలిపారు. సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుండటంతో వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నట్లు చెప్పారు.
– మునిపల్లి, జూన్ 7
మునిపల్లి, జూన్ 7: గోదావరి నీళ్లతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో బీడు భూములు పచ్చగా మారి కోనసీమను తలపించనుందని రాష్ట్ర ఆర్థిక,వైద్యా ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం మునిపల్లి మండలంలోని చిన్నచెల్మడ గ్రామ శివారులో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను నాలుగు వేల మంది రైతుల సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సంగారెడ్డి జిల్లా రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటారన్నారు. నాడు వ్యవసాయమే దండుగ అన్నోళ్ల నోర్లు మూసేలా సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుండటంతో వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి రికార్డుస్థాయిలో పంటలు పండుతున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యలు
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల అసమర్థ పాలనతో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు అధికంగా చోటుచేసుకున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. 60 ఏండ్లు పాలించిన ప్రభుత్వాలు రైతుల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో కరెంట్ వచ్చినప్పుడే పంటకు నీళ్లు అనే దుస్థితి ఉండేదని, రాత్రిళ్లు ప్రమాదాల బారినపడి ఎందరో రైతులు మరణించారని గుర్తుచేశారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, సాగుకు 24 గంటల ఉచిత కరెంట్, సమయానికి ఎరువులు, విత్తనాలు అందిస్తుండటంతో తెలంగాణ రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు
సంగారెడ్డి జిల్లాలో సాగునీరు లేక బీడుగా మారిన 2.19 లక్షల ఎకరాలకు సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా నీరు అందిస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. మరికొన్ని నెలల్లో సంగమేశ్వర ఎత్తిపోతలను పూర్తిచేసుకొని ప్రతి ఎకరాకు సాగునీరిస్తామని, రైతులు దిగులు లేకుండా రెండు పంటలు పండించుకోవచ్చని స్పష్టం చేశారు. ఒక్క సంగమేశ్వర ఎత్తిపోతల పనులనే రూ.2,653 కోట్లతో చేపడుతున్నదంటే రైతుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదో తెలుసుకోవచ్చన్నారు. గోవిందాపూర్ నుంచి 660 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలను లిఫ్ట్ చేయనున్నట్లు తెలిపారు. సంగమేశ్వర ఎత్తిపోతలతో సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలకు ప్రయోజనం జరుగుతుందన్నారు. ఈ ఎత్తిపోతలకు కాళేశ్వరం నుంచి 12 టీఎంసీల గోదావరి జలాలను ప్రభుత్వం కేటాయించిందన్నారు.
ఒకప్పుడు నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ కరువు ప్రాంతాలని, ఈ ప్రాంత రైతులు నీళ్ల కోసం ఆకాశం వైపు చూసేవారన్నారు. వానలు పడక విత్తనాలు మొలకెత్తక రైతులు ఆర్థికంగా చితికిపోయారన్నారు. సింగూరు ప్రాజెక్టు కట్టిన కాంగ్రెస్ ఈ ప్రాంత భూములను ముంచి ఇక్కడి రైతులకు నీళ్లు ఇవ్వలేదన్నారు. సింగూరు నీళ్లను సంగారెడ్డి జిల్లాకు ఇచ్చింది ఒక్క బీఆర్ఎస్ సర్కారు మాత్రమే అన్నారు. సంగారెడ్డికి మెడికల్ కళాశాల ఇవ్వడంతోపాటు జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ దవాఖానలను అభివృద్ధి చేసినట్లు మంత్రి చెప్పారు. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ వెనకబడ్డ ప్రాంతాలు కావని, సమైక్య పాలనలో వెనకబడేసిన ప్రాంతాలన్నారు. రెండేండ్లలో సంగమేశ్వర ఎత్తిపోతలు పూర్తిచేసి ఈ ప్రాంతాలను కోనసీమలా మారుస్తామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు ప్రజలు అండగా నిలవాలని మంత్రి హరీశ్రావు కోరారు. సంగారెడ్డి జిల్లాలో 50 ఏండ్లలో జరగని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్లలో చేసి చూపించినట్లు చెప్పారు.
రైతులను కడుపులో పెట్టుకొంటాం
సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు దిగులు చెందవద్దు.. భూములు కోల్పోతున్న రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని భూ బాధితులకు మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం ఇస్తారో, లేదో అన్న అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. సీఎం కేసీఆర్తో చర్చించి గతంలో కంటే ఎక్కువ నష్టపరిహారం ఇప్పిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అందోల్ ఎమ్మెల్యే యువకుడు, ఉత్సాహవంతుడు అని, ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం అందోల్ ప్రజల అదృష్టం అన్నారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తారన్నారు.
చిన్నచెల్మడలో పల్లెప్రకృతి వనం ప్రారంభం
మండలంలోని చిన్నచెల్మడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి ముందు దీనిని ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రాష్ట్ర నాయకులు సాయికుమార్, భిక్షపతి, జడ్పీటీసీ మీనాక్షిసాయికుమార్, ఎంపీపీ శైలలాశివశంకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్కుమార్, ప్రధాన కార్యదర్శి శశికుమార్, చిన్నచెల్మెడ సర్పంచ్ విజయ్భాస్కర్, ఎంపీటీసీ రాజశేఖర్, ఉప సర్పంచ్ దత్తుగౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
భూములు పచ్చబడుతయ్..
అరవై ఏండ్లలో సాద్యం కాని పనులు తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిస్తున్నది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మడలో నిర్మిస్తున్న సంగమేశ్వర ఎత్తిపోతలతో బీడువారిన భూములన్నీ పచ్చబడుతాయి. ఈ ప్రాజెక్టుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
– చింతా ప్రభాకర్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్
సంబరాలతో వ్యవసాయం
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రైతులు సంబురాలతో కూడిన వ్యవసాయం చేసుకుంటారు. కేసీఆర్ రైతులకు నేరుగా లబ్ధి చేకూరేలా అనేక పథకాలు చేపట్టారు. తెలంగాణలో కరెంటుకు, నీటికి, నిధులకు ఢోకాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. సంగమేశ్వరతో జహీరాబాద్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది.
– మాణిక్రావు, జహీరాబద్ ఎమ్మెల్యే
సంగమేశ్వరతో సస్యశ్యామలం
రూ.2,653 కోట్లతో చేపడుతున్న సంగమేశ్వర ఎత్తిపోతలతో అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లోని 2,19 లక్షల ఎకరాలు సస్యశ్యామలంగా మారుతుంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి.
– బీబీ పాటిల్, జహీరాబాద్ ఎంపీ
రైతుల జీవితాల్లో వెలుగులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు సాక్షిగా అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల రైతుల జీవితాల్లో వెలుగులు నిండనున్నట్లు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం మండలంలోని చిన్నచెల్మడ గ్రామ శివారులో సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. సింగూర్ నుంచి సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఈ బృహత్తరమైన కార్యక్రమం చేపడుతుందని కలలో కూడా ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధికి అమాడ దూరంలో ఉన్న అందోల్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ల ప్రత్యేక కృషితో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నట్లు తెలిపారు.
మన నీళ్లు మనకే..
మన నీళ్లను మనమే వాడుకునేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. గత పాలకుల హయాంలో సింగూర్ డ్యాంలో పుష్కలంగా నీళ్లు ఉన్నా సాగుకు, తాగుకు గుక్కెడు నీటిని వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత మన నీటిని మనమే వినియోగించుకొని పంటలు బాగా పండించుకునే అవకాశం వచ్చింది. ప్రతి రైతు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు.
– శైలజాశివశంకర్, ఎంపీపీ
రైతులకు పండుగే..
సింగూర్ డ్యాం నుంచి సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించడం అంటే రైతులకు పండుగే.. రైతుల ఇళ్లలో సిరులు కురింపించేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఏ ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు, పథకాలు అమలు చేయలేదు. కేసీఆర్ రైతు బిడ్డ గనుకే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు.
– మీనాక్షీసాయికుమార్, జడ్పీటీసీ
తెలంగాణలో రైతే రాజు
సమైక్య రాష్ట్రంలో రైతులు అనేక అవస్థలు పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలను రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. దేశం గర్వపడేలా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ అమలు చేస్తున్నారు. మునిపల్లి మండలంలో సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించడం ఇక్కడి రైతుల అదృష్టం. ఈ ప్రాజెక్ట్తో ఎంతో లాభం చేకూరుతుంది.
– విజయ్భాస్కర్, చిన్నచెల్మడ సర్పంచ్