హుస్నాబాద్, ఏప్రిల్ 14: తాటి, ఈత వనాలు దగ్ధం కావడంతో నష్టపోయిన కల్లుగీత కార్మికులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో ఇటీవల దగ్ధమైన తాటి, ఈత వనాలను ఆయ న సందర్శించారు. గీత కార్మికులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ తాటి, ఈత వనాలు కాలిపోవడంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోయారని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అగ్ని ప్రమాదమా, కుట్రపూరితంగా జరిగిన ఘటననా అనే అంశంపై విచారణ జరిపించాలని పోలీసు, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ప్రకృతి సంపద అయిన తాటి, ఈత వనాలను విరివిగా పెంచడం తప్ప వాటిని దగ్ధం చేయ డం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కలు పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గీత కార్మికులకు అండగా ఉంటానని, ఉన్నతాధికారులతో మాట్లాడి సహకారం అందేలా కృషి చేస్తానని మంత్రి చెప్పారు. ఆయన వెంట కల్లుగీత కార్మికులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.