వేలేటి రోజాశర్మ సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 11: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించొద్దని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అధికారులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, విద్యా-వైద్యం అంశాలపై 2వ, 3వ, 4వ స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు.
మనఊరు-మనబడి పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. యాసంగికి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని.. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పామాయిల్, మల్బరీ పంటల సాగుపై చొరవ తీసుకొని విస్తీర్ణం పెరిగే దిశగా కృషి చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీటీసీలు లక్ష్మి, కోఆప్షన్ మెంబర్ సలీం, జడ్పీటీసీ కొండల్రెడ్డి పాల్గొన్నారు.