మెదక్ అర్బన్, నవంబర్7: మెదక్ జిల్లాలో ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని మెతుకు సీమ సత్తా చాటాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను మీరు కూడా ఓటు వేయండి’ అనే నినాదంతో మంగళవారం మెదక్ కలెక్టరేట్ నుంచి మెదక్ రాందాస్ చౌరస్తా వరకు ఆయా శాఖ అధికారులు, కళాశాల విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎన్నికల అధికారి రాజర్షి షా, ఎస్పీ రోహిణిప్రియదర్శిని మాట్లాడుతూ.. ఈ నెల 30న ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు ప్రకారం పండుగ వాతావరణంలో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని అనేక అవగాహన కార్యక్రమలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 579 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నిష్పక్షపాతంగా, స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మెదక్, నర్సాపూర్, జిల్లాలో ఉన్న ఓటర్లందరూ తమ ఓటు హక్కునువినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేం ద్రాలకు ఎన్నికల కమిషన్ గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డులు తమ వెంట తీసుకుని వెళ్లి, పోలింగ్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని సత్తా చాటాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని, దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా పోలింగ్ రోజు ఎక్కడికి వెళ్లకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు వేస్తామని రాందాస్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ మహేందర్, డీఎస్పీ ఫణీందర్, డీడబ్ల్యూ అధికారి బ్రహ్మాజీ, డీపీవో సాయిబాబు, డీఏఓ గోవింద్, జమ్లానాయక్, సిబ్బంది పాల్గొన్నారు.