సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 24: ఓటరు జాబితా సమగ్ర సవరణలో ప్రతిఓటరూ భాగస్వామి కావాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. ఈనెల 25 నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ ప్రకటన జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఈ ప్రత్యేక సవరణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి ఓటరు వివరాలను సక్రమంగా నమోదు చేయడం, జాబితాలోని తప్పులు సరిదిద్దడం పారదర్శకం గా నిర్వహించాలన్నారు. జూలై 24 వరకు జిల్లాలో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ జూలై 31న, క్లేయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ జూలై 31 నుంచి ఆగస్టు 30వరకు, క్లయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం సెప్టెంబర్ 28 వరకు, తుది ఓటరు జాబితా ప్రచురణ అక్టోబర్ 1న ఉంటుందని కలెక్టర్ వివరించారు.