సిద్దిపేట, మే 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అకాల వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వానలకు వరిపైర్లు దెబ్బతినడంతో పాటు కోసిన ధాన్యం తడిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు సీఎం కేసీఆర్ భరోసానిస్తున్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. తడిసిన ధాన్యం సైతం సేకరణ చేసేలా ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులేత్తయడంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తున్నది. వారం క్రితం జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా, రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుక వస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లాలో…
ఈ సీజన్లో సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 4,765 మంది రైతుల నుంచి 22,163 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రూ.11 కోట్లు మేర డబ్బులు అధికారులు జమచేశారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. మంత్రి హరీశ్రావు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నా దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 324 కేంద్రాలు ప్రారంభం…
సిద్దిపేట జిల్లాలో ఈ సీజన్లో 419 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటి వరకు 324 కేంద్రాలను ప్రారంభించారు. వీటిలో మహిళా సంఘాల నేతృత్వంలో 159, సహకార సంఘాలు 159, మెప్మా 6 కేంద్రాలను ప్రారంభించారు. మరో 95 కేంద్రాలను జిల్లాలో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు మహిళా సంఘాలు 2,239 మంది రైతుల నుంచి 10,568 మెట్రిక్ టన్నుల ధాన్యం, సహకార సంఘాల ద్వారా 2,398 మంది రైతుల నుంచి 11,091 మెట్రిక్ టన్నుల ధాన్యం, మెప్మా ద్వారా 128 మంది రైతుల నుంచి 502 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. జిల్లాలో మొత్తం 4,765 మంది రైతుల నుంచి 22,163 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకు కొన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెంట వెంటనే ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారు.
మద్దతు ధరతో సేకరణ..
యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఏ-గ్రేడ్ ధాన్యం రూ.2060, బీ-గ్రేడ్ ధాన్యం రూ.2040 మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. విత్తనాలు,ఎరువుల దగ్గర నుంచి పంట పెట్టుబడి వరకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి ఉంటున్నది. జిల్లాలో 3,31,000 ఎకరాల్లో వరి సాగైంది. ఈ యాసంగిలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కవ రోజులు కేంద్రాల్లో ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తూకమైన వెంటనే మిల్లులకు తరలించేలా పక్కాగా ఏర్పాట్లు చేశారు. అవసరమైన గన్నీ బ్యాగులు, వేయింగ్ మిషన్లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచారు.
ఇబ్బందులు లేవు
ఐదు ఎకరాల్లో వరి వేసిన. కరెక్ట్ కోతల సమయానికి వడగండ్ల వానలు పడ్డయ్. కోద్దామంటే మిషన్ మడ్లల్లకు పోవుడు ఇబ్బంది అయింది. ఇప్పటికైతే ఐదు ఎకరాల పంట అమ్మిన. ఇయ్యాలనే కాంటా పూర్తయింది. వడ్లను కాంటా వేసి లారీల్లో తీసుకుపోతుండ్రు. గత పదిరోజుల నుంచి అయితే వానలు చెయ్యబట్టి ఇబ్బంది అయిన మాట వాస్తవమే. ఇప్పుడు కొనుగోళ్లు జల్ది అయితున్నయ్. రైస్ మిల్లుల్లో కూడా ఇబ్బందులుపెడ్తలేరు. పంట బాగా వచ్చింది.
– నిమ్మ యాదిరెడ్డి, రైతు, తోర్నాల
సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు
మాకు రైతుబంధు, రైతుబీమా అందుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు వ్యవసాయం బాగుంది. కరెంట్ మంచిగ అస్తున్నది. యాసంగిలో పంటలు మంచిగ పండినయి. కానీ, అకాల వానలు మమ్మల్ని ఆగంజేస్తున్నయి. మాఊళ్లనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిండ్రు. వచ్చినయి వచ్చినట్లు వడ్లు కొంటున్నరు. సీఎం కేసీఆర్ మాలాంటి రైతుల పాలిట దేవుడు.
– బచ్చల సుధాకర్, రైతు, గురువన్నపేట
మ్యాచర్ వచ్చిన ఎంటనే కాంటా పెడతర్రు
ఎకరం పొలం వరి వేసిన. మొన్నటిదాక వానలే పడే. వడ్లు అయితే ఎండుతలేవు. ఐదు రోజులు అయింది వడ్లను సెంటర్కు తెచ్చి. నిన్న,మొన్ననే ఎండలు బాగా కొడుతున్నయ్. రెండురోజులకే మ్యాచర్ చూపిత్తాంది. సీరియల్ నంబర్ ఇస్తుండ్రు. తెల్లారి పిలిచి కాంటా పెడుతుర్రు. ఇబ్బందులు అయితే లేవు. జల్దినే పైసలు వత్తయని అంటుర్రు.
– మాడుగుల మల్లవ్వ, రైతు, తోర్నాల, సిద్దిపేట రూరల్ మండలం
కొన్ని అమ్మిన,మల్లా తెచ్చిన
రెండు ఎకరాల్లో వరి ఏసిన. మొన్నటిదాకా వానలు పడ్డాయ్. వరి కోత కోసుడు కూడా ఇబ్బంది అయింది. మిషన్ మడ్లళ్లకు దిగలేదు. మొదాలు కొంత కోసి సెంటర్కు తెచ్చిన. వడ్లను కాంటా పెట్టినంక మిగతాది కోసి మల్లా తెచ్చినం. ఇప్పుడిప్పుడే ఎండుతున్నయ్. మ్యాచర్ రాగానే కొంటుర్రు. కాంటా పెట్టి ఎప్పుటికప్పుడు లారీలల్ల తీసుకుపోతుర్రు.
– వాసూరి దేవయ్య, ఇర్కోడు, సిద్దిపేటరూరల్ మండలం
ఆనలకు నష్టపోయినయి..
యాసంగిలో వరి పంట ఆనలకు నష్టపోయినయ్. అడ్లను జెప్పన కొనడానికి సీఎం కేసీఆర్ ఊర్లల్లో అడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిండ్రు. ఇప్పుడిప్పుడే వరి కోతలు కోస్తుండ్రూ. అడ్లుకొన్న 72 గంటల్లోనే మా బ్యాంకులల్లో డబ్బులు ఎత్తనని సార్లు చెప్పిర్రు. ఈ తాప కాలం ఆగంజేస్తన్నది.
– కాస కిష్టయ్య, రైతు, మిరుదొడ్డి
కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు..
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మేలు జరుగుతున్నది. గతంలో పండించిన ధాన్యాన్ని =దళారులకు అమ్మి రైతులు మోసపోయేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. కేంద్రం వడ్లు కొనమని చెప్పినా సీఎం కేసీఆర్ రైతుల కోసం గ్రామాల్లో సెంటర్లు ఏర్పాటు చేశారు. కాంటా పెట్టిన మూడ్రోజుల్లనే రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులు జమ అవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధరను అందిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– మంకెన శ్రీనివాస్రెడ్డి, యువరైతు, లద్నూర్ (మద్దూరు)
దళారుల పాలు కాకుండా కాపాడిండు..
నాకు 11 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొంతభాగం కూరగాయలు, మొక్కజొన్న,కందులు సాగుచేశా. మిగతా భూమిలో వరి ఏశాను. మా వూరిలో ఇంతకుముందు ధాన్యం కొనుగోలు కేంద్రం లేదు. ఏడాదిన్నరగా పెడుతున్నరు. కొనుగోళ్లు కేంద్రం లేనప్పుడు సావుకారికి వడ్లు పెట్టేటోడిని. అధికారులు కేంద్రం ఏర్పాటు చేసినంక ఇక్కడనే అమ్ముతున్న. కాంటకు వెట్టిన వారం రోజుల్లోపే అకౌంట్లో పైసలు పడుతున్నయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు రైతులకు చాలా మేలు చేసిండు
-షేక్ మహ్మద్, నాచారం, వర్గల్ మండలం