తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ చూపిన పోరాట పటిమను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, రజకసంఘాల నాయకులు అన్నారు. మంగళవారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. పలుచోట్ల ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించగా, రజక సంఘం భవనాల నిర్మాణాలకు భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు.
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 26 : చాకలి ఐల మ్మ మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అన్నారు. మంగళవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో చాకలి ఐలమ్మ జయంతి సం దర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి సీపీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ భూస్వాములకు వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ తన పోరాటంలో అనేక ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో రోకలి బండ చేతబూని పోరాడి ఎదిరించిన వైనం, మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు అందె శ్రీనివాసరావు, మల్లారెడ్డి, ఏవో యాదమ్మ, ఎస్బీ ఇన్స్పెక్టర్ రఘుపతిరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, ధరణి కుమార్, సూపరిండెంటెండ్ట్లు జమీల్ పాషా, ఫయాజుద్దీన్, అబ్దుల్ ఆజాద్, సిబ్బంది పాల్గొన్నారు.