లక్నో: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సీనియర్ అధికారి ప్రయాణించిన ఎస్యూవీ అదుపుతప్పింది. డివైడర్ను దాటి మరో లేన్లో వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బోర్డర్ ఫోర్స్ అధికారి, డ్రైవర్ మరణించారు. మరికొందరు గాయపడ్డారు. (Border force officer killed) ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఐటీబీపీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) పర్మిందర్ సింగ్ ఇటీవల మసూరీలో ఒక శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్యానాలోని అంబాలాకు ఎస్యూవీలో ఆయన ప్రయాణమయ్యారు.
కాగా, శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో డెహ్రాడూన్-పంచకులా జాతీయ రహదారిపై ప్రయాణించిన ఆ ఎస్యూవీ అదుపుతప్పింది. ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లా ఝబీరాన్ కట్ సమీపంలో డివైడర్ను ఢీకొట్టింది. అటువైపు రోడ్డులోకి ఆ వాహనం దూసుకెళ్లింది. హరిద్వార్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇరు వాహనాల్లో ఉన్నవారు వాటి లోపల చిక్కుకున్నారు.
మరోవైపు ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే ఐటీబీపీ డీఐజీ పర్మిందర్ సింగ్, ఆయన డ్రైవర్ రవిశంకర్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గన్మ్యాన్ జైరామ్ చేతికి గాయం కావడంతో అతడికి చికిత్స అందిస్తున్నారు.
కాగా, స్విఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్న 49 ఏళ్ల గురునానక్ సింగ్, 55 ఏళ్ల దేవేంద్ర కౌర్, 55 ఏళ్ల గుర్నామ్ సింగ్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ ముగ్గురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నదని చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.