కరోనా మళ్లీ కలవరం సృష్టిస్తున్నది. కొత్తగా పుట్టుకొచ్చిన జేఎన్-1 వేరియంట్ కలవరపెడుతున్నది. సంగారెడ్డి జిల్లాలో తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిని హోంక్వారంటైన్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ దవాఖానలో వ్యాధి నిర్ధారణ కిట్లు, కేసుల సంఖ్య పెరిగితే చికిత్సలు అందజేసేందుకు ప్రత్యేకంగా వార్డును సిద్ధ్దం చేశారు. వైద్యారోగ్యశాఖ పరిధిలోని పీహెచ్సీల్లో 1064 ఆక్సిజన్ బెడ్లను సిద్ధ్దంగా ఉంచారు. ఈ వైరస్తో ప్రజలకు ముప్పు లేకపోయినా ప్రమాదం ఉన్నదని, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్తే మాస్కులు తప్పకుండా ధరించాలని సూచిస్తున్నారు.
సంగారెడ్డి, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం రెండు కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం వారిని హోంక్వారైంటన్లో ఉంచి చికిత్సలు అందజేస్తున్నారు. కేసులు పెరగకుండా వైద్యారోగ్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో కేసుల సంఖ్య పెరిగితే చికిత్సలు అందజేసేందుకు వీలుగా సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. సంగారెడ్డి దవాఖానతోపాటు వైద్యారోగ్యశాఖ పరిధిలోని పీహెచ్సీల్లో ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచారు. కరోనా కేసులు పెరగటంలేదని, ప్రజలు భయాందోళనకు గురికావద్దని, ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు ప్రారంభించారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన పరిధిలో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రంలో ప్రతిరోజూ 15 పరీక్షలు చేస్తున్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే, పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలోని పీహెచ్సీలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన ర్యాపిడ్ టెస్టు కిట్లను అందుబాటులో ఉంచారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రామచంద్రాపురంలో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా, కంది మండలం కవలంపేటలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. పాజిటివ్ వచ్చిన ఇద్దరినీ హోంక్వారంటైన్లోఉంచి చికిత్సలు అందజేస్తున్నారు. కరోనా కేసులు సంఖ్య పెరిగితే చికొత్స అందజేసేందుకు వీలుగా వైద్యారోగ్యశాఖ తగిన ఏర్పాట్లు చేపడుతుంది. సంగారెడ్డి జిల్లా దవాఖానలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయటంతోపాటు 30 ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచారు. పీహెచ్సీలో 1064 ఆక్సిజన్ బెడ్లను, ప్రైవేటు దవాఖానల్లో 800 ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచారు.
కరోనా విషయంలో ప్రజలు ఎవ్వరూ భయాందోళనకు గురికావద్దు. జిల్లాలో ప్రస్తుతం రెండు పాజిటివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కొవిడ్ నిబంధనలను పాటించాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. జన సంచారంలో ఎక్కువగా ఉండకూడదు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.