సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 11: ప్రజల సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు హరిత మినర్వా హోటల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, టీఎన్జీవో నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద మంత్రి పొన్నం నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తామ ని, మొట్ట మొదటి గ్యారంటీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. మిగతా గ్యారంటీలు 100 రోజుల్లో నిష్పక్షపాతంగా అమలు చేస్తామన్నారు.సిద్దిపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అభివృద్ధితో పాటు ఇతర విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ప్రత్యేక చొరవ తీసుకుంటానన్నారు. పార్టీలకతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గుగూల్ మ్యాప్ను అనుసరించి గౌరవెళ్లి ప్రాజెక్ట్లోకి వాహనాలు వెళ్తున్నాయని.. ఆ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గ్యారంటీలను అమలు చేయడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు దేవులపల్లి యాదగిరి, గంప మహేందర్, తాడూరి శ్రీనివాస్గౌడ్, పూజల హరికృష్ణ పాల్గొన్నారు.
గజ్వేల్, డిసెంబర్ 11: కాంగ్రెస్పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని, ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం గజ్వేల్కు వచ్చిన సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ కల్పించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు పెంచామన్నారు. భవిష్యత్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే తప్పకుండా అందజేస్తామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. అర్హులై ఉండి ఇండ్లులేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి రూ.5లక్షల సాయం అందజేస్తామన్నారు.చిన్నసన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రైతుబంధు ఇస్తామన్నారు. జిల్లాలోని గౌరవెల్లి, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపు బాధితుల సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. అంతకు మందు గౌడసంఘం ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్రెడ్డి, హరికృష్ణ, పీర్లపల్లి రవీందర్రెడ్డి, నరేందర్రెడ్డి, మోహన్, మల్లారెడ్డి, గౌడసంఘం నాయకులు విజయ్కుమార్గౌడ్, దేవేందర్గౌడ్, రమేశ్గౌడ్ పాల్గొన్నారు.