Prahlad Joshi : కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రి (Union Education Minister) గా సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) శనివారం కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) నేపథ్యంలో 36 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఈ పరిస్థితుల దృష్ట్యా తాను ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా సమర్పించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఆయన రాజీనామా చేసిన కాసేపట్లోనే ప్రహ్లాద్ జోషికి ఈ కీలక శాఖను అప్పగించారు. నేడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో స్పందించారు. ‘కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించాను. నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. వినయంతో, కర్తవ్య నిష్టతో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
కర్ణాటకకు చెందిన ప్రహ్లాద్ జోషి ధార్వాడ్ లోక్సభ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. గతంలో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖల మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల అనంతరం వినియోగదారుల వ్యవహారాలు, పునరుత్పాదక ఇంధన శాఖలను నిర్వహించారు.