Greater Noida : గ్రేటర్ నోయిడా పరిధిలో దారుణం జరిగింది. 15 అడుగుల లోతైన, నీళ్లున్న గోతిలో పడి ఆరేళ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ఏరియాలో ఉన్న కళాధామ్ సొసైటీ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదం జరిగిన గోతిని గ్రేటర్ నోయిడా సిబ్బంది తవ్వి, నిర్లక్ష్యంగా వదిలేశారు. అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఒక పైప్ లైన్ ప్రాజెక్టు కోసం సిబ్బంది 15 అడుగుల లోతున్న గోతిని తవ్వారు. దీని చుట్టూ బారికేడ్లు, రక్షణ చర్యలు ఏర్పాటు చేయలేదు. శివాన్ యాదవ్ (6) అనే బాలుడు ఇతర పిల్లలతో కలిసి గోతికి దగ్గరలో ఉన్న చోటులో ఆడుకున్నాడు. ఈ క్రమంలో శివాన్ యాదవ్ ఆడుకుంటూ వెళ్లి గోతిలో పడిపోయాడు. వెంటనే గమనించి తోటి పిల్లలు చుట్టుపక్కల వారికి విషయం చెప్పారు. వారు వేగంగా స్పందించి బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. నీటిలో మునిగిన బాలుడిని బయటకు తీశారు. అప్పటికే బాలుడు అపస్మారక స్థితికి వెళ్లాడు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
బాలుడి మృతితో స్థానికులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అధికారులు నిర్లక్ష్యం వల్లే బాలుడు మరణించాడని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఘటనా స్తలాన్ని సందర్శించారు. దీనిపై విచారణకు ఆదేశించారు.