కర్ణాటక ప్రభుత్వం కృష్ణా, భీమా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, చెక్డ్యాంలు, బ్యారేజీల కారణంగా తెలంగాణకు రావాల్సిన నదీ జలాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆరోపించారు. హైడ్రాలిక్ గేట్లు ఏర్పాటు చేసి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
కర్ణాటక ప్రభుత్వం కృష్ణా, భీమా నదులపై నిర్మిస్తున్న అక్రమ చెక్ డ్యాంలు, బ్యారేజీలు, రిజర్వాయర్లను బీఆర్ఎస్ నాయకుల బృందం ఆదివారం పరిశీలించింది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నాయకులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కూడా బృందంతో కలిసి కృష్ణా, భీమా నదుల పరిధిలోని ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఆర్డీఎస్ పరిధిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల కారణంగా తుంగభద్ర జలాలు తెలంగాణ వైపు రావడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నీటి కొరతతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కర్ణాటక నుంచి నీటి ప్రవాహం నిలిచిపోతే రానున్న యాసంగి సీజన్లో తెలంగాణ రైతులు పంటలు సాగు చేసుకునే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు జరుగుతున్న నష్టంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి కర్ణాటకలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా కృష్ణా, భీమా నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, బ్యారేజీలు, చెక్డ్యాంల వద్ద వాస్తవ పరిస్థితులను పరిశీలించినట్లు తెలిపారు. పరిశీలన అనంతరం పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించి, తెలంగాణ రైతుల పొలాలకు సాగునీరు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.