నారాయణఖేడ్, ఆగస్టు 8: ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. దివ్యాంగుల పింఛన్ను రూ.3,016 నుంచి 4,016లకు పెంచిన నేపథ్యంలో మంగళవారం నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని దివ్యాంగులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా కేసీఆర్ ప్రభుత్వం పింఛన్లను అందజేస్తుందన్నారు. తాను ఇటీవల ముంబయిలో జరిగిన లేజిస్లేచర్ కాన్ఫరెన్స్కు వెళ్లిన సందర్భంగా అక్కడికి వచ్చిన అన్ని రాష్ర్టాల ప్రతినిధులు పింఛన్ల విషయం ప్రస్తావించినప్పుడు తమ రాష్ట్రంలోనే ఇతర రాష్ర్టాల కంటే ఎక్కువగా పింఛన్ ఇస్తున్నట్లు చెప్పడం తనకెంతో గర్వంగా ఉందన్నారు.
దివ్యాంగుల పింఛన్ను రూ.1 వెయ్యి అదనంగా పెంచి సీఎం కేసీఆర్ పెద్ద మనసును చాటుకున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చే రూ.200, రూ.500 పింఛన్లు పరిమితికి మించి ఇచ్చే వారు కాదని, తమ ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని పది రెట్లు పెంచడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రతి పథకాన్ని అవినీతిమయం చేసి తమ జేబులు నింపుకొన్నారని, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా పథకాలను అమలు చేసి, నేరుగా లబ్ధి చేకూరుస్తుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో, ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అంతా ప్రజల ముందు ఉందని మళ్లీ సుపరిపాలనను కోరుకునే వారు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని దీవించాలని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పచ్ ఎం.ఏ.నజీబ్, మున్సిపల్ వైస్చైర్మన్ పరశురామ్, మునిస్పల్ కమిషనర్ మల్లారెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.