ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నది. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పనిచేసిన జిల్లా, మండల స్థాయి అధికారుల బదిలీలు తప్పవనే చర్చ జోరుగా వినిపిస్తున్నది. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిని హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా, సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతను హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్గా రెండు రోజుల కిందట ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు నచ్చిన అధికారులను తెచ్చుకునే పనిలో నేతలు ఉన్నారు. ఏ అధికారి ఎన్ని ఏండ్ల నుంచి పని చేస్తున్నారు. ఎవరెవరు ఎక్కడ పని చేస్తున్నారని ఇటీవల సిద్దిపేట జిల్లా స్థాయి అధికారుల రివ్యూ మీటింగ్లోనే జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. నూతన సంవత్సరంలో ఒక దాని తర్వాత ఒక ఎన్నిక వచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఉన్న జిల్లా యంత్రాంగాన్ని యథావిధిగా కొనసాగిస్తారా..? లేక బదిలీలు చేస్తారా..? అనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జోరుగా నడుస్తున్నది. దీంతో అధికారుల్లో బదిలీల గుబులు పట్టుకుంది.
సిద్దిపేట, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నది. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పనిచేసిన జిల్లా, మండల స్థాయి అధికారుల బదిలీలు తప్పవనే చర్చ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్నది. ఏ నలుగురు అధికారులు కలిసినా ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. దీంతో జిల్లా అధికారుల్లో బదిలీల గుబులు పట్టుకుంది. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతను హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్గా, మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిని హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా రెండు రోజుల కిందట బదిలీ చేసిన విషయం తెలిసిందే. జిల్లాల కలెక్టర్లు సైతం బదిలీ అవుతారన్న చర్చ సైతం జరుగుతున్నది. వీరితో పాటు జిల్లాలోని ప్రధాన శాఖల హెచ్వోడీలు బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు నచ్చిన అధికారులను తెచ్చుకునే పనిలో నేతలు ఉన్నారు. తాము చెప్పింది చేసే అధికారి ఉండాలని అధికార పార్టీ నేతలు కోరుకుంటున్నారు. ఏ అధికారి ఎన్ని ఏండ్ల నుంచి పని చేస్తున్నారు. ఎవరెవరు ఎక్కడ పని చేస్తున్నారు అని సిద్దిపేట జిల్లా స్థాయి అధికారుల రివ్యూ మీటింగ్లోనే ఇటీవల జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. దీంతో ఆయా విభాగాల హెచ్ఓడీలు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పని చేస్తున్న వారి వివరాలను మంత్రికి తెలియ జేశారు. ఇక తమ బదిలీలు జరుగుతాయనే చర్చ జరుగుతున్నది. మూడేండ్లు ఇక్కడే పనిచేస్తున్న అధికారుల డేటాను సైతం అడిగినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పలు కీలక శాఖల అధికారుల బదిలీకి రంగం సిద్ధమవుతున్నది. రెండు రోజుల కిందట మంత్రి కాన్వాయ్ వస్తే ట్రాఫిక్ను ఆపలేదు అంటూ కొంత మంది అధికార పార్టీ నేతలు సదరు పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మా ప్రభుత్వం మేం చెప్పింది చేయాలే తప్పా మరోటి ఇక్కడ చేయవద్దు అంటూ తమ ఆక్రోశాన్ని సైతం సంబంధిత పోలీస్ అధికారులపై వెళ్లగక్కారు.
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జిల్లాలోని ప్రధానమైన శాఖల్లో బదిలీలపై చర్చ జోరుగా కొనసాగుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గత ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన అధికారుల బదిలీలు తప్పవనే చర్చ ఉంది. ఎలాగు ఈ ప్రభుత్వం తమను ఏదో ఒక్క చోటికి బదిలీ చేస్తుంది.. ఇక తమ బదిలీ ఎప్పుడు వచ్చినా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కనీసం ఇక్కడ కాకపోయినా వేరే చోట పక్క జిల్లాలోనే ఉంటే బాగుండు అని కోరుకుంటూ తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని అధికార యంత్రాంగం మొన్నటి శాసనసభ ఎన్నికలను ఒకటి రెండు చోట్ల మినహా అంతటా సమర్థవంతంగా ముగించారు. మొత్తంగా జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించారు. త్వరలోనే జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉంది. నూతన సంవత్సరంలో ఒక దాని తర్వాత ఒక ఎన్నిక వచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఉన్న జిల్లా యంత్రాంగాన్ని యథావిధిగా కొనసాగిస్తారా..? లేక బదిలీలు చేస్తారా..? అనే చర్చలు ఉద్యోగ వర్గాల్లో జోరుగా జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలోని కొన్ని ప్రధాన శాఖల అధికారుల మార్పు తప్పనిసరి ఉంటుందన్న చర్చ కూడా జరుగుతుంది. దీంతో ఆయా శాఖల అధికారులు తమ బదిలీ విషయంలో అధికార పార్టీ ముఖ్యనేతల ద్వారా అమాత్యుల వద్ద పైరవీలు చేసుకుంటున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు అనుకూలంగా ఉండే జిల్లాలో కీలకమైన ప్రధాన శాఖల అధికారులను తెచ్చుకునేందుకు అప్పుడే తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏండ్ల తరబడి ఒకే చోట పనిచేసిన అధికార యంత్రాంగాన్ని ఆ స్థానాల నుంచి బదిలీ చేయాలని అధికార పార్టీ నాయకులు మంత్రుల దృష్టికి తీసుకుపోతున్నారు.