కోహెడ, ఫిబ్రవరి 8: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో గల గుట్టల్లో ప్రకృతి సోయగాల మధ్య పతాపరుద్ర సింగరాయ జాతర శుక్రవారం జరగనున్నది. ఏటా మాఘమ, పుష్యమి బహుళ అమావాస్య రోజున జాతర నిర్వహిస్తారు. రోజంతా ప్రకృతి అందాల మధ్య విహారయాత్రను తలపించేలా జాతర జరుగుతుంది. జాతరకు మహారాష్ట్రలోని ముంబై, భీవండి, చాందానాగ్పూర్, పూణె పట్టణాల నుంచే కాకుండా మెదక్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుంచి 2 లక్షల వరకు భక్తులు తరలివస్తారు. జాతరకు రావడానికి సిద్దిపేట-హన్మకొండ రహదారి బస్వాపూర్, బద్దిపడగల స్టేజీల నుంచి, సిద్దిపేటకరీంనగర్ రహదారి శనిగరం స్టేజీ నుంచి , కోహెడ మండల కేంద్రం నుంచి కూరెల్ల మీదుగా దారులు ఉన్నాయి.
ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం, రేణుకా ఎల్లమ్మ ఆలయం, పంచముఖ హనుమాన్, లైమ్స్టోన్తో చెక్కిన పంచముఖ బ్రహ్మ విగ్రహాలతో పాటు కొండపై గుహలో వెలసిన లక్ష్మీనర్సింహుల ఆలయం ఉంది. భక్తులు నదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. వచ్చే దారిలో గాజుల బండపై ఏర్పాటయ్యే దుకాణాల్లో తినుబండారాలు, ఆటబొమ్మలు కొనుగోలు చేస్తారు. జాతరలో మద్యం, మాంసాహారం ఆనవాళ్లు కనిపించవు. రాత్రయితే స్వామివారికి తలనొప్పి వస్తుందని భక్తులు ఇంటిదారి పడుతుంటారు.