జహీరాబాద్, జూలై 1 : తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని మల్గి గ్రామంలో కొన్ని నెలలుగా చెలరేగిన చెత్తదుమారంపై ఎట్టకేలకు జిల్లా అధికారులు స్పందించారు. బుధవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన ‘మళ్లీ చెత్తదుమారం’ అనే కథనానికి సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్జైన్తో పాటు సంబంధిత జిల్లా అధికారులు స్పందించారు.
ఈమేరకు మండలంలోని మల్గి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో కర్ణాటకలోని బీదర్ నగర మే యర్ గౌసొద్దీన్, డిప్యూటీ కమిషనర్ సిద్ధుగొండ తదితరులతో న్యాల్కల్ మండల తహసీల్దార్ ప్రభులు, అభివృద్ధి అధికారి, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు, హద్నూర్ ఎస్సై దోమ సుజిత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్రావు, గ్రామస్తులతో సమావేశమైయ్యారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామ నాయకులు, ప్రజలు మాట్లాడుతూ కొన్ని నెలలుగా గ్రామ శివారు గుండా డంపింగ్యార్డుకు చెత్తవాహనాలు తరలించడంతో దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని సంబంధిత అధికారులతో మొరపెట్టుకున్నారు. డంపింగ్యార్డుకు వెళ్లే దారిగుండా పొలాలకు వెళ్లే రైతులపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయన్నారు. డంపింగ్ యార్డుకు తరలిస్తున్న చెత్తవాహనాలతో ఏర్పడుతున్న ఇబ్బందులతోనే వాహనాలను అడ్డుకున్నామని స్పష్టం చేశారు.
బీదర్నగర మున్సిపాలిటీ మేయర్, డిప్యూటీ కమిషనర్లు మాట్లాడుతూ డంపింగ్ యార్డుకు చెత్తవాహనాలు వెళ్లేందుకు రోడ్డు నిర్మించుకుంటామని, పాడైన రోడ్డుతో పాటు, మల్గి గ్రామం వరకు సీసీ రోడ్డు, తాగునీటి కోసం రెండు బోర్లు తవ్వించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బీదర్ నగర పాలక మేయర్, డిప్యూటీ కమిషనర్ విన్నపం మేరకు మల్గి గ్రామ శివారు గుండా డంపింగ్ యార్డుకు చెత్తవాహనాలు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
ఈ విషయమై గ్రామస్తుల సమక్షంలో రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు రాతపూర్వకంగా రాసుకున్నారు. అనంతరం మల్గి గ్రామ సరిహద్దు ప్రాంతంలోని రోడ్డు మార్గంలో పారబోసిన చెత్తాచెదారాన్ని జేసీబీ సహాయంతో తొలిగించి వాహనాల్లో నిండి డంపింగ్యార్డుకు తరలించారు. డంపింగ్యార్డులో దుర్గంధం వేదజల్లకుండా దోమలు, ఈగలు నివారించేందుకు మందులు పిచికారీ చేస్తామని బీదర్ నగర మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.