రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద నిర్మించిన ఐటీసీ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ యూనిట్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీసీ కంపెనీ దేశంలోనే అతిపెద్ద యూనిట్ను దండుపల్లిలో నిర్మించిందని, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని,వెయ్యిమందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండల పరిసరాల్లో రైతులు పండిస్తున్న ఆలుగడ్డలను చిప్స్ తయారీ కోసం కొనుగోలు చేయాలని మంత్రి పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు.
-రామాయంపేట/మనోహరాబాద్/తూప్రాన్, జనవరి 30
రామాయంపేట/మనోహరాబాద్/తూప్రాన్, జనవరి 30: రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని, ఈ పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద నిర్మించిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ పరిశ్రమను సోమవారం ఐటీసీ సీఎండీ సంజయ్పూరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో నలువైపులా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వర్గాలు ముందుకు రావాలని కోరారు.దండుపల్లి వద్ద ఐటీసీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 59 ఎకరాల్లో, 16.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొదటి దశలో రూ. 450 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఈ పరిశ్రమలో సుమారు వెయ్యి మందికిపైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
ఈ పరిశ్రమలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారని, ప్రపంచ శ్రేణి ఫుడ్ బ్రాండ్లయిన ఆశీర్వాద్ ఆటా, సన్ఫీస్ట్ బిస్కెట్లు, బింగో చిప్స్, నూడిల్స్ వంటి వాటిని దశల వారీగా ఉత్పత్తి చేస్తారన్నారు. ఐటీసీ కంపెనీ దేశంలోనే తమ అతిపెద్ద ఫుడ్ పరిశ్రమను దండుపల్లిలో ఏర్పాటు చేసిందన్నారు. ఈ పరిశ్రమ స్వచ్ఛ ఇంధనాన్ని తమ రూఫ్టాప్ సోలార్ ఎనర్జీ మాడ్యూల్స్ ద్వారా ఉత్పతి చేయనుందన్నారు. పరిశ్రమలో శాస్త్రీయంగా డిజైన్ చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఉండటంతో గరిష్టంగా నీటిని పొదుపు చేస్తుందన్నారు. తద్వారా భూగర్భ జలాలపై ఆధారపడటం చాలా వరకు తగ్గుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందన్నారు.
ఈ పరిశ్రమ ఉపాధి అవకాశాల్లో మహిళలకు 50శాతం భాగస్వామ్యాన్ని కల్పిస్తోందన్నారు. మెదక్ జిల్లాలో వైద్య, విద్య తదితర రంగాల్లో అభివృద్ధికి ఐటీసీ పరిశ్రమ యాజమాన్యం సహకారం అందించాలని కోరారు. పంటలు పండించమే కాకుండా పాడి పరిశ్రమ చేపడితేనే రైతు బాగుంటాడనే ఉద్దేశంతో విజయ డెయిరీ ఆధ్వర్యంలో పాడిరైతులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదన్నారు.
స్థానిక రైతుల పంటలు కొనాలి..
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండల పరిసరాల్లో రైతులు పండిస్తున్న ఆలుగడ్డలను చిప్స్ తయారీ కోసం ఐటీసీ పరిశ్రమ కొనుగోలు చేయాలని మంత్రి కేటీఆర్ పరిశ్రమను కోరారు. ఐటీసీ పరిశ్రమకు ఏ పంటలు అవసరమున్నా ఈ ప్రాంత రైతులు పండిస్తారని, రైతులు పండించినవి కొనుగోలు చేసి, ఫుడ్స్ తయారు చేయాలన్నారు. దేశంలో తెలంగాణలోనే భద్రాచలం, బొల్లారంలో అతిపెద్ద పేపర్ తయారీ పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఐటీసీ కంపెనీ ఇంటిగ్రేటెడ్ యూనిట్ను రాష్ట్రంలోని భద్రాచలంలో రూ. 2 వేల కోట్లతో నూతన బాయిలర్ సాంకేతికతతో ఏర్పాటు చేసిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీని కారణంగా ఇంధనంగా బొగ్గుపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందన్నారు.
ఐటీసీ అగ్రి బిజినెస్ వరి, జొన్న, తృణ ధాన్యాలు, మిర్చి, పసుపు వంటి పంటలపై ప్రత్యేకంగా దృష్టిసారించిందని, పంటల అభివృద్ధి కోసం తెలంగాణాలోని రైతులను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నదన్నారు. తద్వారా రాష్ట్రంలో ఉత్పత్తయిన ఆహార పదార్థాలను సేకరించి ఎగుమతి చేయడం ద్వారా తెలంగాణ పంటలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సీఎస్ఆర్ కార్యకలాపాలను సైతం ఐటీసీ విస్తరిస్తున్నదన్నారు. ఇందులో మహిళా సాధికారిత, నైపుణ్యాభివృద్ధి, ప్రాథమిక విద్య, పశు సంరక్షణ, ఆరోగ్యం, పారిశుధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ వంటివి ఐటీసీ పరిశ్రమ చేపట్టడం అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు.
మొక్కలను పెంచి కాపాడుదాం..
8 విడతలుగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో రాష్ట్రం హరిత తెలంగాణగా మారిందని, హరితహారంలో భాగంగా ప్రతి వాడ, ప్రతి ఇల్లు, పరిశ్రమలో కూడా మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సాధిద్ద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఐటీసీ కంపెనీ ఆవరణలో మొక్కను నాటి నీరు పోశారు. నాటిన మొక్కలను పరిరక్షించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుందని పరిశ్రమ నిర్వాహకులకు సూచించారు.
కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్ గౌడ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, ఆర్డీవో శ్యాంప్రకాశ్, తహశీల్దార్ భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, మనోహరాబాద్ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి, ఎంపీపీ పురం నవనీత రవి, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్, కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేశ్, పలు శాఖల అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.