పెద్దశంకరంపేట, మే 15: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లిలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని పలు ఇండ్లలో చొరబడి భారీగా చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. చీలపల్లికి చెందిన రాయిని రాములు ఇంటికి తాళం వేసి కామారెడ్డి జిల్లా బాన్సువాడకు వెళ్లారు. శుక్రవారం ఉదయం పనిమనిషి ఇంటికి వెళ్లగా, తాళాలు పగులగొట్టి ఉండటం చూసి వెంటనే రాయిని రాములుకు సమాచారం అందించడంతో హుటాహుటినా ఇంటికి చేరుకున్నారు.
ఇంటికి వెళ్లి చూడగా, బీరువాలు పగులగొట్టి 110 తులాల బంగారం, 2.50 కిలోల వెండి దొంగిలించ బడిందని గుర్తించారు. సమీపంలో ఉన్న మరో ఇంట్లో సైతం మూడు తులాల బంగారం దొంగలించినట్లు బాధితుడు ఏసిరెడ్డి మానిక్రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, క్రైం సీఐ రాజశేఖర్, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం ఎస్ఐలు ప్రవీణ్రెడ్డి, శంకర్ శుక్రవారం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
రాయిని రాములు ఇంట్లో మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఇంటి పరిసర ప్రాంతాలు, పగలగొట్టిన బీరువాను పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్స్కాడ్ చీలపల్లికి చేరుకొని దొంగతనం జరిగిన ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ దొంగలను పట్టుకుంటామని తెలిపారు. సీసీ కెమెరాలు ఫుటేజీలను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు శుభకార్యాలు, ఇతర పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు ఉంచుకోరాదని ఎస్పీ సూచించారు. చోరీపై బాధితులు పెద్దశంకరంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.