Thieves | మెదక్, మే 24 (నమస్తే తెలంగాణ) : పెద్ద శంకరంపేట మండలంలోని చీలపల్లి గ్రామంలో ఇటీవల వరుసగా జరిగిన చోరీల కేసులను మెదక్ పోలీసులు చాకచక్యంగా ఛేదించి దొంగలను అరెస్ట్ చేశారు. దొంగిలించబడిన భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేశారు. ఈ నెల 14,15 తేదీల రాత్రి సమయంలో చీలపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఐదు ఇళ్లలోకి దుండగులు చొరబడి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 109 తులాల 9 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి వస్తువులు, రూ.19 వేల నగదు దొంగిలించబడింది. మరో కేసులో మూడు తులాల బంగారం చోరీకి గురైంది. మిగతా ఇళ్లలో విలువైన వస్తువులు దొరకకపోవడంతో అవి సురక్షితంగా నిలిచాయి.
ఫిర్యాదుదారుడు రాయని రాములు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న మెదక్ పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు, గూఢచారి వ్యవస్థ, సమాచార సేకరణ ద్వారా ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన జాదవ్ జైరాం నాయక్ అలియాస్ జెమ్లా నాయక్ (45), రాథోడ్ ఇప్పు సింగ్ అలియాస్ ఇప్పు (32)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు మోటార్ వాహనంపై గ్రామాలకు వచ్చి, ముఖ్యంగా ఊరి చివరలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇనుప రాడ్లతో తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి బంగారం, వెండి వస్తువులను దొంగిలించేవారని పోలీసులు తెలిపారు.
దొంగిలించిన సొత్తును జైరాం నాయక్ తన తల్లి వద్ద దాచిపెట్టి, కొంతకాలం తర్వాత కొద్దికొద్దిగా విక్రయించేవాడని విచారణలో బయటపడింది. పోలీసులు నిందితుల వద్ద నుంచి మొత్తం 929.7 గ్రాముల బంగారం, 1.7 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించి దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులను గ్రామస్తులు అభినందించారు.

