సిద్దిపేట, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు నియామకం కానున్నట్లు తెలుస్తున్నది. ఎన్ని గ్రామాలు…ఎంత మంది అధికారులను నియమించాలి…? అని జిల్లాల వారీగా లెక్కలు తీసే పనిలో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ఉన్నట్లు సమాచారం. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి.. ఆలెక్కన ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాలకు సరిపడా అధికారులను వెతికే పనిలో జిల్లాల అధికారులు ఉన్నారు.దీంతో గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న సిబ్బందిపై దృష్టి సారించారు. పోలీస్ శాఖ మినహా…మిగతా శాఖలైన రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య తదితర శాఖల్లో ఉన్న వారిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించడానికి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఒక వేళ ప్రస్తుత సర్పంచ్లకే పర్సన్ ఇన్చార్జీలుగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ లెక్కన ఆయా గ్రామాల సర్పంచ్లను నియమించే విధంగా జాబితాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆనిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్లడానికి జిల్లా అధికారులు జాబితాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుత గ్రామ సర్పంచ్లు, వార్డు మెంబర్ల పదవీ కాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనున్నది. దీంతో ఇప్పటికప్పుడు పంచాయతీ ఎన్నికలు సాధ్యం కావు .. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు తమనే పర్సన్ ఇన్చార్జీలుగా నియమించాలని ఆయా గ్రామాల సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ మెజార్టీ గ్రామాల సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండడంతో కాంగ్రెస్ ఆనిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోంది.
పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జంకుతున్నది. గత శాసనసభ ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆహామీల అమలులో ఘోరంగా విఫలమవుతున్నది. ఇప్పటికే గ్రామాల్లో కాంగ్రెస్పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని భావించి ప్రత్యేకాధికారుల పాలనను తీసుకువస్తున్నది. గత ప్రభుత్వం గ్రామాల్లో పదేండ్ల పాటు ఒకే రిజర్వేషన్ ఉండాలని పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చింది. గత ప్రభుత్వం తీసుకువచ్చింది. పంచాయతీ ఎన్నికలను పాత రిజర్వేషన్ల ప్రకారం నిర్వహించవచ్చు.. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ప్రస్తుత ప్రరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఎన్నిక అవుతారని కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకున్నట్లు ఉంది. అందుకే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ జంకుతున్నదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది.
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గడువుకు కంటే ముందే ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సిన అవసరం ప్రస్తుతం నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది.కానీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా వచ్చే నెలలోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్ జిల్లాలో 469, సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం (కేవలం తొమ్మిది రోజులు మాత్రమే) 2024 ఫ్రిబ్రవరి 1వ తేదీతో ముగుస్తుంది. 2019 జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. గత ఎన్నికల సమయంలో నూతనంగా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం రెండుసార్లు ఒకే రిజర్వేషన్ అందుబాటులో ఉంటుంది. ఆయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాత రిజర్వేషన్ విధానం కొనసాగించే పరిస్థితిలో లేదు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. వీటితో పాటు ఉపకులాల వారీగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా ..? లేదా ..? వేచి చూడాల్సిందే.