మెదక్ జిల్లాలో యువజనుల ఓట్లు కీలకం కానున్నాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని యువ ఓటర్లు నిర్దేశించనున్నారు. కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారి నుంచి మొదలుకొని 39 ఏండ్లలోపు ఉన్న వారిపై అన్నిపార్టీల అభ్యర్థులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల తుదిజాబితా ప్రకారం మెదక్ జిల్లాలో 4,34,275 మంది ఓటర్లు ఉండగా, అందులో యువజనులే సగానికిపైగా ఉన్నారు. 18 నుంచి 39 ఏండ్లలోపు వారు 2,24,228 మంది ఉండడం గమనార్హం. వీరితో పాటు మహిళలు సైతం నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎకువగా ఉన్నారు. దీంతో ఆయా పార్టీ అభ్యర్థులు యువతతో పాటు మహిళలను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టిసారించారు. ఇప్పటికే ఎన్నికల ఇన్చార్జిలను నియమించి బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతున్నది. కాంగ్రెస్, బీజేపీ అధిష్టానాలు ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ప్రచారంలో వెనకబడి పోయాయి.
– మెదక్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ)
మెదక్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కానున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల భవిత వారిపైనే ఆధారపడి ఉన్నదని చెప్పవచ్చు. దీంతో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారి నుంచి 39 ఏండ్లలోపు ఉన్న వారిపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టిపెట్టారు. మెదక్ జిల్లాలో యువ ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటరు 4,34,275 మంది ఉండగా, 18 నుంచి 40 ఏండ్లలోపు వారే 2,24,228 మంది ఉన్నారు. వీరే రాజకీయ నేతల తలరాతను తిరగ రాయనున్నారు.
మరోవైపు, మహిళలు సైతం నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. జిల్లాలో పురుష ఓటర్లు 2,09,927 ఉంటే, మహిళా ఓటర్లు 2,24,337 ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలు యువతతోపాటు మహిళలను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించాయి. కీలకమైన మహిళలు, యువకుల మద్దతు తమకే అంటూ అన్ని పార్టీలు చెప్పుకుంటున్నా, బీఆర్ఎస్ అందరి కంటె ముందున్నది. మరోవైపు, జిల్లాలో 90-99 ఏండ్ల వృద్ధ ఓటర్లు 508 మంది ఉండగా, 100-109 ఏండ్ల వారు 21మంది ఉన్నారు. 120 ఏండ్లకు పైబడిన 8 మంది ఈ ఎన్నికల్లో ఓటుహకును వినియోగించుకోనున్నారు.
మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తుది జాబితా విడుదల చేసింది. ఇందులో మెదక్లో మొత్తం 4,34,275 ఓటర్లు ఉన్నారు. పురుషులు 2,09,927 మంది, స్త్రీలు 2,24,337 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 9 మంది ఉండగా, సర్వీస్ ఓటర్లు 124 మంది ఉన్నారు. కొత్త ఓటర్లు ఓటుహకు నమోదుకు ఈ నెల 31 వరకు ఎన్నికల సంఘం గడువు విధించింది. నామినేషన్ల స్వీకరణకు పది రోజుల ముందు వరకు ఓటర్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
మెదక్ జిల్లా వ్యాప్తంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గ యువ ఓటర్లు కీలకం కానున్నారు. 18-19 ఏండ్ల వయస్సు గల ఓటర్లు 15,596 మంది, 20-29 ఏండ్ల వారు 94,163, 30-39 ఏండ్ల వారు 1,14,469, 40-49 ఏండ్ల వారు 94,354, 50-59 ఏండ్ల వారు 58,589, 60-69 ఏండ్ల వారు 36,324, 70-79 ఏండ్ల వారు 16,629, 80-89 ఏండ్ల వారు 3,614 మంది, 90-99 ఏండ్ల వారు 508, 100-109 ఏండ్ల వయస్సు వారు 21 మంది, 120 ఏండ్ల పైబడిన ఓటర్లు 8 మంది ఉన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 4,34,275 ఓటర్లు ఉన్నారు.
బీఆర్ఎస్ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రచారంలో దూసుకెళ్తున్నది. మెదక్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, హ్యాట్రిక్ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులను ఆయా పార్టీల అధిష్ఠానాలు ఇంకా ప్రకటించలేదు. దీంతో బీఆర్ఎస్ ప్రచారంలో ముందుండగా, ఆ రెండు పార్టీలు వెనకబడి ఉన్నాయి.