రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. పంట పెట్టుబడి సాయం అందించి ఆర్థికంగా అండగా ఉంటున్నది. వరుసగా మూడోసారి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు నింపుతున్నది. పంటలు ఎండిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇటీవల మంత్రి తన్నీరు హరీశ్రావు రంగనాయకసాగర్ ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలు విడుదల చేయగా, శుక్రవారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల ద్వారా ప్రజాప్రతినిధులు కూడవెల్లి, హల్దీవాగులకు నీటిని వదిలారు. తద్వారా లక్షలాది ఎకరాలకు నీరంది యాసంగి పంటలు గట్టెక్కనున్నాయి. ప్రభుత్వ చేయూతతో వానాకాలం మాదిరిగా యాసంగిలోనూ వరి సాగవుతున్నది. వరి కాకుండా ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, వేరుశనగ, శనగ తదితర పంటలు సైతం జోరుగా సాగవుతున్నాయి.
– సిద్దిపేట, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరిసాగు (ఎకరాల్లో)
సిద్దిపేట జిల్లాలో 2,91,969
సంగారెడ్డి జిల్లాలో 82,400
మెదక్ జిల్లాలో 2,10,445
సిద్దిపేట, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వర గంగ మన వ్యవసాయ భూముల వైపు సాగుతున్నది.. మన పంట పొలాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో సిద్దిపేట జిల్లాలోని చెరువులు, కుంటలను మూడేళ్లుగా నింపుతున్నారు. దీంతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. గత ఏడాది కన్నా ఘనంగా పంటల సాగు..జిల్లాలోని 26 మండలాల్లోని 383 రెవెన్యూ గ్రామాల్లో 127 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో వ్యవసాయ శాఖ అధికారులు పంటల వివరాలను సేకరించారు. ఆ వివరాలను వ్యవసాయ శాఖ పోర్టల్లో పొందుపర్చారు. ఆ లెక్కల ప్రకారం యాసంగిలో సిద్దిపేట జిల్లాలో వరిసాగు గణనీయంగా పెరగింది. ఈసారి 2,91,969 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గత సంవత్సరం కన్నా అధికంగా వరిసాగవుతున్నది. మరోవైపు మెదక్ జిల్లాలో 2,10,445, సంగారెడ్డి జిల్లాలో 82,400 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు.
ఆరుతడి అధికంగా.. ఉద్యానం ఉత్సాహంగా..
ప్రధాన ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, వేరుశనగ, శనగ తదితర అన్ని పంటలను కలుపుకొని జిల్లాలో యాసంగి సీజన్లో 3,19,399 ఎకరాలు సాగవుతున్నది. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. యాసంగిలో ఇప్పటి వరకు 2,96,394 మంది రైతులకు రూ.291.44 కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
2,91,969 ఎకరాల్లో వరిసాగు
కాలం కలిసి రావడంతోపాటు ప్రభుత్వ చేయూతతో జిల్లావ్యాప్తంగా ఉన్న రైతులు సంబురంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రధానంగా వరి పంటను రైతులు ఎక్కువగా పండిస్తారు. ప్రస్తుత యాసంగిలో ఎక్కవగా వరిపంట సాగు చేస్తున్నారు. ఇతర పంటలూ సాగులో ఉన్నాయి. ఈ సీజన్లో వరి 2,91,969 ఎకరాలు, కంది 15.22 ఎకరాలు, మొక్కజొన్న 15,757 ఎకరాలు, శనగ 2,990 ఎకరాలు, వేరుశనగ 1292 ఎకరాలు, పొద్దుతిరుగుడు 5,910 ఎకరాలు, స్వీట్ కాన్ 710 ఎకరాలు, పత్తి 36 ఎకరాలు.. మొత్తం యాసంగిలో 3,19,399 ఎకరాలు సాగవుతున్నది. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసింది. నాలుగైదు రోజుల్లోనే రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేసింది.
లెక్క పక్కాగా ఉంటేనే రైతుకు ప్రయోజనం..
పంటల సాగు వివరాలనే రైతులు కరెక్ట్గా తెలిపితేనే పండిన పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. రైతు పండించిన పంట ఒకటి, నమోదు మరోటి ఉంటే ధాన్యం అమ్ముకునే సమయంలంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏటా పంటసాగు వివరాలను పక్కాగా సేకరిస్తున్నది. సాగు వివరాలు పక్కాగా ఉంటే ఏ గ్రామం నుంచి ఎంత పంట వస్తుందో ముందే మనకు తెలిసిపోతుంది. మన రాష్ట్ర అవసరాలకు సరిపడా చూసుకొని ఏ పంటను ఏ రాష్ర్టానికి ఎగుమతి చేసుకోవచ్చనే ప్రణాళికను ముందే రూపొందించుకోవచ్చు.
మూడేళ్లుగా ప్రాజెక్టు నీటి విడుదల
జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల ద్వారా సాగు నీటిని విడుదల చేసి చెరువులు, చెక్డ్యాంలు నింపడంతో మండు టెండల్లో అవి మత్తడి దుంకుతున్నాయి. వరుసగా మూడో ఏట సాగునీరు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లున్నాయి.
పంటలు ఎండిపోకముందే ఇటీవల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు రంగనాయక సాగర్ ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలను విడుదల చేశారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నుంచి కూడవెల్లి, హల్దీవాగులకు గోదావరి జలాలను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం నీటిని విడుదల చేశారు. గోదావరి జలాలు చెరువుల్లోకి పరుగులు పెడుతున్నాయి. ఇలా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటున్నది.