తెలంగాణ 2కే రన్ ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు, యువజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రన్ కార్యక్రమానికి ఉదయం 6 గంటల నుంచే ఎమ్మెల్యే, అధికారులు, ఉపాధ్యాయులు, యువత పెద్దఎత్తున తరలివచ్చారు. మెదక్లో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సంగారెడ్డిలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్లతో కలిసి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జెండా ఊపి వేడుకలను ప్రారంభించారు. ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, మాణిక్రావుతోపాటు వివిధ శాఖల అధికారులు స్థానికంగా రన్లో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ అన్ని రంగాలకు సమప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. క్రీడలపై యువత ఆసక్తి కనబర్చాలని, శారీరక దృఢత్వంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.
– సంగారెడ్డి/ మెదక్ న్యూస్నెట్వర్క్, జూన్12
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ రన్ ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. స్థానిక పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరుగులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలు చోట్ల డీజే పాటలు, స్టెప్పులతో యువకుల్లో జోష్ నింపారు. ర్యాలీలో సినీ తారలు, గాయకులు పాల్గొని ఆట పాటలతో హుషారెత్తించారు. అనంతరం 2కే, 5కే రన్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.